E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026
దేశంలోని 304 మిలియన్ల డిజిటల్ కస్టమర్లలో దాదాపు 88 శాతం మంది హిడెన్ ఛార్జీలు, బలవంతపు కొనుగోళ్లు, డ్రిప్ ప్రైసింగ్ (చివరి నిమిషంలో అదనపు రుసుములు కలపడం) వంటి వాటి వల్ల నెలకు సగటున రూ.78 నుండి రూ.87 వరకు
- Author : Sudheer
Date : 14-06-2026 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
E Commerce : భారతదేశంలో ఇ-కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ఉపయోగిస్తున్న “డార్క్ ప్యాటర్న్స్” (మోసపూరిత డిజిటల్ డిజైన్లు) వల్ల దేశీయ వినియోగదారులు భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ‘డేటమ్ ఇంటెలిజెన్స్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ తప్పుడు పద్ధతుల వల్ల భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా సుమారు రూ.25,000 కోట్ల నుండి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని 304 మిలియన్ల డిజిటల్ కస్టమర్లలో దాదాపు 88 శాతం మంది హిడెన్ ఛార్జీలు, బలవంతపు కొనుగోళ్లు, డ్రిప్ ప్రైసింగ్ (చివరి నిమిషంలో అదనపు రుసుములు కలపడం) వంటి వాటి వల్ల నెలకు సగటున రూ.78 నుండి రూ.87 వరకు నష్టపోతున్నారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ ఏడాది జనవరిలో రూ.44 లక్షల జరిమానాలు విధించినప్పటికీ, దేశంలోని 73 శాతం ప్లాట్ఫారమ్లు వినియోగదారులను బలవంత పెట్టే విధానాలను, 69 శాతం సంస్థలు డ్రిప్ ప్రైసింగ్ను యథేచ్ఛగా కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ డిజిటల్ మాయాజాలం మరియు తీవ్రమైన వ్యతిరేకత మధ్య కూడా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమజాన్’ (Amazon) దేశంలోనే అత్యంత విశ్వసనీయ ప్లాట్ఫారమ్గా అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది వినియోగదారులు అమెజాన్ను సురక్షితమైనదిగా పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా వంటి సంస్థలు కస్టమర్ల నుండి నెగటివ్ టాక్ (Net distrust) మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ ప్రతి కొనుగోలుపై కస్టమర్ల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తుండటంతో 41 శాతం మంది దానిపై నమ్మకం లేదని తేల్చి చెప్పారు. ఇక ఆన్లైన్ ట్రావెల్ విభాగంలో ‘మేక్మైట్రిప్’ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందగా, ‘క్లియర్ట్రిప్’ మాత్రం వినియోగదారులను తీవ్రంగా నష్టపరుస్తున్న మోసపూరిత ప్లాట్ఫారమ్ల జాబితాలో ముందుంది. క్విక్ కామర్స్ రంగంలో ‘బిగ్బాస్కెట్’ అత్యంత అధ్వాన్నమైన స్కోరును నమోదు చేసింది. ఈ మోసపూరిత పద్ధతుల వల్ల వినియోగదారులు ఇతర యాప్స్కు మారిపోతుండటంతో ఏకంగా రూ.55,000 కోట్ల విలువైన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (GMV) ప్రమాదంలో పడే అవకాశం ఉందని, అందుకే ప్రభుత్వ నిబంధనలను మరింత ఆధునీకరించాలని నివేదిక స్పష్టం చేసింది.