Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్
వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు.
- By Pasha Published Date - 05:05 PM, Sun - 7 July 24

Sonia Gandhi : ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉంది. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కీలక సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు సేవ చేయడం కోసం బలపడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఈనెల 8న విజయవాడలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలను( YSR Birth Anniversary) నిర్వహించబోతున్నారు. దీనికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ కూడా హాజరవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏపీ సీఎం రేవంత్కు కూడా షర్మిల ఇప్పటికే ఆహ్వాన లేఖను అందజేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ విడుదల చేసిన సందేశం అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి నిస్వార్థంతో, అకింత భావంతో దేశానికి, రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని సోనియా తెలిపారు. వైఎస్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సోనియా.. ఓ మనిషిగా, కాంగ్రెస్ పార్టీలో విలువైన సహోద్యోగిగా ఆయన పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని ఆమె చెప్పారు. వైఎస్సార్ జీవితం అనూహ్యంగా ముగిసిపోవడం చాలా బాధాకరమని సోనియా పేర్కొన్నారు. వైఎస్ మరణానికి తాము ప్రతి రోజూ సంతాపం తెలుపుతామన్న సోనియా.. ఆయన చూపిన మార్గంలో నడుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వైఎస్సార్ స్మృతిని గౌరవిస్తుందని వెల్లడించారు.
Also Read :Ration Cards : రేషన్ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..
ఈ సందేశాన్ని విడుదల చేసినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ షర్మిల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తనపై సోనియాగాంధీ ఉంచిన నమ్మకం అనేది తనకు అప్పగించిన మహత్తర బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుందన్నారు. ‘‘రాజశేఖర రెడ్డి స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని ముందుకు సాగుతాం. కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్తగా ప్రజలకోసం పనిచేస్తాం. రాహుల్ గాంధీ ఆశయసాధన కోసం పోరాడుతూనే ఉంటాం’’ అని షర్మిల తెలిపారు. కాగా, రేపు (ఈనెల 8న) వైఎస్సార్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఇతర కీలక నేతలు హాజరవుతారని అంటున్నారు.