కుప్పంపై పొలిటికల్ బాంబ్..బాబుపై రాళ్లదాడి, కమాండోల రక్షణ
కుప్పంలో ఏమి జరుగుతోంది? నిజంగా బాంబులు వేయడానికి ప్రయత్నం జరిగిందా? చంద్రబాబునాయుడు సభలో బాంబు కలకలం ఎందుకు? ఏపీ రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన సంస్కృతి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
- By Hashtag U Published Date - 12:48 PM, Sat - 30 October 21
కుప్పంలో ఏమి జరుగుతోంది? నిజంగా బాంబులు వేయడానికి ప్రయత్నం జరిగిందా? చంద్రబాబునాయుడు సభలో బాంబు కలకలం ఎందుకు? ఏపీ రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన సంస్కృతి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడ్ని ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ పూనింది. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద పైచేయిని సాధించారు. ఇక చంద్రబాబు కుప్పం నుంచి గెలవలేడని వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. స్థానిక ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబునాయుడు తొలిసారిగా కుప్పం పర్యటనకు వెళ్లాడు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. పూర్వపు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు టీడీపీ తీసుకుంది. తొలి విడత స్థానిక ఎన్నికలకు ముందు చంద్రబాబు కుప్పం వెళ్లినప్పుడు జరిగిన అవమానాన్ని ఆ పార్టీ గుర్తు పెట్టుకుంది. ఆర్ అండ్ బీ బంగ్లాలో బాబు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా కరెంట్ కట్ చేశారని ఆనాడు టీడీపీ భావించింది. అందుకే ఈసారి అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఇదిలా ఉంటే, బాబు 30, 31వ తేదీల్లో కుప్పంలోనే ఉన్నారు. ఆయన పర్యటనకు వస్తే ముందే బాంబులు వేస్తామంటూ వైసీపీలోని కొందరు నాయకులు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులు రాజకీయాల్లో సహజంగా వింటుంటాం. కోడిగుడ్లు వేస్తాం..రాళ్లు విసురుతాం..బాంబులు వేస్తాం..అంటూ ప్రత్యర్థులను బెదిరిస్తుంటారు. అలాంటి వాళ్లను ముందుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ముందస్తు ప్రణాళికను పోలీసులు రచించుకుంటారు. ఉద్రిక్తతల మధ్య జరిగే పర్యటనలకు సంబంధించి ప్రత్యేకమైన కసరత్తును పోలీస్ విభాగం చేస్తుంది.
చంద్రబాబు కుప్పం పర్యటన విషయంలో మాత్రం పోలీసులు లైట్ గా తీసుకున్నారు. భద్రతను కల్పించడంలో చిత్తూరు పోలీస్ వైఫల్యం చెందారు. ఫలితంగా ఈ పర్యటనకు ముందు హెచ్చరించిన విధంగా వైసీపీ కార్యకర్త ఒకరు బాంబుదాడి చేస్తానంటూ చంద్రబాబు సభలో కలకలం సృష్టించాడు. అంతేకాదు, భారీగా గుమికూడిన జనం మధ్య నుంచి కొందరు రాళ్లు విసిరారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న బాబును సంరక్షించే బాధ్యతను బ్లాక్ కమోండోలు తీసుకున్నారు.
ఒక వేళ వాళ్లు అప్రమత్తంగా లేకపోతే బాంబులు వేయడానికి వైసీపీకి చెందిని కొందరు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది.ముందుగా హెచ్చరించి ప్రత్యర్థుల మీద దాడులకు దిగడం ఏపీలోని కొత్త రాజకీయ సంస్కృతి బయలు దేరింది. పైగా ప్రభుత్వంలోని పార్టీకి చెందిన క్యాడర్ విపక్ష లీడర్లను భయకంపితులను చేయడం దారుణం. మునుపెన్నుడూ ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. సహజంగా సామాజిక అంశాలపై పోరాడే వాళ్లు అధికారంలో ఉన్న లీడర్లు వచ్చినప్పుడు అడ్డగించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కోడిగుడ్లు, రాళ్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నేతల పర్యటనలు అడ్డుకోవడం, రాళ్లు విసరడం ఏపీ రాజకీయాల్లోని వినూత్నం.
చంద్రబాబును కుప్పంలో ఓడించాలంటే, రాజకీయ పరమైన ఎత్తుగడలు వేసుకోవచ్చు. ఎన్నికల వచ్చినప్పుడు వాటిని అమలు చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ, పర్యటనలకు రాకుండా అడ్డుకోవడం ద్వారా చంద్రబాబునే కాదు ఎవర్ని నిలువరించినా ప్రభుత్వ తప్పే. ఇలాంటి పరిణామాలు భవిష్యత్ లో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే, జగన్ ప్రభుత్వానికి అపవాదు తప్పదు.
Related News
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.