Janasena : మల్లవల్లి రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ
మల్లవల్లి రైతులకు టీడీపీ, బీజేపీ పార్టీలు అండగా నిలవాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్
- Author : Sudheer
Date : 06-08-2023 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మూడు రోజులుగా వరుసగా సమావేశాలు జరుపుతూ వస్తున్న పవన్..ఈరోజు ఆదివారం బాపులపాడు మండలం మల్లవల్లి (Mallavalli)లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులు తమ బాధను పవన్ కళ్యాణ్ కు తెలియజేసారు. ప్రతి రైతు చెప్పిన బాధలు విని , పవన్ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ..మల్లవల్లి రైతులకు (Mallavalli Farmers) అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2016లో పారిశ్రామికవాడ కోసం 1,460 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం..సాగుదార్లకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, అర్హులమైనా తమకు పరిహారం రాలేదంటూ అప్పట్నుంచి వారు పోరాటాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా మల్లవల్లి రైతులకు టీడీపీ, బీజేపీ పార్టీలు అండగా నిలవాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతులకు కులాలు అంట గడితే టీడీపీ (TDP) ఖండించాలని పవన్ అన్నారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతులు (Farmers) సమస్యలపై దృష్టి సారిస్తాం అని , రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను నేను తప్పు పట్టను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారని పవన్ పేర్కొన్నారు. పరిహారం అడిగితే పోలీసులతో కొట్టించారని రైతుల ఆవేదన చెందుతున్నారు. కొంతమంది రైతులను నడవలేని పరిస్థితికి తెచ్చారు. మరికొందరిని జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చు. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు.