No law and order: నో లా అండ్ ఆర్డర్..! అరెస్ట్ వెనుక..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. చంద్రబాబును జైలుకు పంపాలనకున్నారు.
- By CS Rao Published Date - 10:15 AM, Sat - 9 September 23
No law and order: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. చంద్రబాబును జైలుకు పంపాలనకున్నారు. అంతే ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.!’ అన్నట్లు శుక్రవారం రాత్రి నుంచి పోలీసు అధికారులు పక్కా ప్రణాళికతో చంద్రబాబును నంద్యాలలో ఉద్రిక్తతల నడుమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. అనంతరం చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చటం, 14 రోజుల రిమాండ్, అనంతరం జైలుకు తరలింపు కార్యక్రమం.. బయట తెలుగుదేశం శ్రేణులు బంద్ కు పిలుపి ఇవ్వటం, అక్కడక్కడా ఉద్రిక్తతల వంటి సంఘటనలతో ఈరోజు అంతా ఒకటే హడావుడి మాములే.
అసలేం జరిగింది.?
నంద్యాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు బసచేసిన ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
చట్టవిరుద్ధమన్న న్యాయవాదులు
తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. నాహక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి అని చంద్రబాబు అన్నారు. ఏ చట్టప్రకారం నన్ను అరెస్టు చేస్తారు చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారన్నారు. అయితే హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు తెలిపారు. మరోవైపు చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో వాదిస్తున్నారు. ఆధారాలు చూపించాలని అడిగారు. రిమాండ్ రిపోర్టులో అన్నీ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ ఇస్తామన్నారు. అయితే ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిందేనని న్యాయవాదులు పట్టుబట్టారు. సూపర్వైజర్ ఆఫీసర్ రావాల్సిన అధికారం ఏముందని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. మమ్మల్ని చుట్టుముట్టి బెదిరించడం సరికాదని ఈ సందర్భంగా పోలీసులు అన్నారు. చెదిరించట్లేదని, మా హక్కులు అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయవాదులు అంటున్నారు.
మీడియాను దూరంగా పంపి
మరోవైపు మీడియాను పోలీసులు దూరంగా పంపించివేశారు. పోలీసులతో న్యాయవాదులు చర్చించారు. అరెస్టు పత్రాలను వారు పరిశీలించారు. అయితే కొన్ని గంటల్లో అన్ని పత్రాలు ఇస్తామని పోలీసులు తెలిపారు.
తెరపైకి డీకే బసు కేసు
ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈ సందర్భంగా తెదేపా అధినేత పోలీసులను ప్రశ్నించారు. తనని అరెస్టు చేసే ముందు ఆ పత్రాలను ఇవ్వాలని అన్నారు. అయితే అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని చంద్రబాబు అన్నారు. అరెస్టు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని పోలీసులు చెబుతున్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అవగాహన లేకుండా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారని పోలీసులు అనగా, పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందని చంద్రబాబు అన్నారు.
సీన్ క్రియేషన్ ఎలా
చంద్రబాబు బస చేసిన ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి తదితర స్థానిక తెదేపా నేతలు ఉన్నారు.
పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి, ఎన్ఎస్జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్ఎస్జీ కమాండెంట్కి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం సరికాదని, ఆయన ఎక్కడికీ పారిపోయే వ్యక్తి కాదంటూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబుకు తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని పోలీసులు పేర్కొన్నారు.
కేసు ఏంటని నాయకులు, న్యాయవాదులు అడిగినా..వారు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని తెదేపా నేతలు పోలీసులకు చెప్పారు. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ కదులుతోందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని పోలీసులు తెలిపారు. వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు. చంద్రబాబుకు ఇబ్బంది కలుగకుండా వెళ్తే వాహనాలు అడ్డుతీస్తామని తెదేపా శ్రేణులు పేర్కొన్నాయి.
రోప్ పార్టీ ఏర్పాటు
తెదేపా కార్యకర్తల వ్యతిరేకత మధ్యే చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. తమ చర్యలకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా పోలీసులు చూసుకుంటున్నారు. చంద్రబాబును కలిసి ఆయనకు నోటీసు ఇవ్వాలని డీఐజీ రఘురామరెడ్డి తెదేపా నేతలతో చెప్పారు. మరోవైపు ఫంక్షన్ హాల్ వద్ద తెదేపా నేతలు అడ్డుపెట్టిన వాహనాలను పోలీసులు జేసీబీతో తొలగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వీఐపీని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని ఎన్ఎస్జీ పోలీసులకు స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 5.30 గంటల వరకు అనుమతి ఇవ్వబోమని ఎన్ఎస్జీ పేర్కొంది. ఆ తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు.
Related News
AP Politics : ఏపీపై మేఘా కృష్ణా రెడ్డి సర్వే.. రాజకీయ వర్గాల్లో చర్చ
ఏపీలో ఎన్నికల ఉత్కంఠ రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు టీడీపీ కూటమి గెలుపు ఖరారైనట్లు తెలుస్తోంది.