Modi Cabinet 2024: చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోడీ
కేంద్ర మాజీ మంత్రి, రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో ఊహించని వ్యక్తులకు చోటు కల్పించారు.
- Author : Praveen Aluthuru
Date : 09-06-2024 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లను మంత్రివర్గంలో ఖరారు చేశారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) తొలిసారి ఎంపీగా ఎంపికయ్యారు. రాష్ట్రంలో భాజపా నుంచి ఎవరికీ మంత్రి పదవి రాదనే అభిప్రాయం కొన్ని గంటలుగా ఉన్నా ఇక్కడ కూడా బీజేపి నాయకత్వం అనూహ్యంగా వ్యవహరించింది. భీమవరం ఎంపీగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా శ్రీనివాస వర్మకు మంత్రివర్గంలో చోటు దక్కినట్లు పార్టీలో వినిపిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమెకు మంత్రివర్గంలో స్థానం దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ఆమెకు కాల్ రాలేదు. మిత్రపక్షమైన టీడీపీకి అవకాశం ఇవ్వాల్సి రావడంతో పురంధేశ్వరిని పక్కన పెట్టారని భావిస్తున్నారు. అంతే కాకుండా ఆమెకు మంత్రి పదవి ఇస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వాల్సి రావచ్చన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. పురంధేశ్వరి పార్టీని నడుపుతున్న తీరు నాయకత్వానికి నచ్చడంతో ప్రస్తుతానికి పురంధేశ్వరిని మంత్రి బాధ్యతలకు దూరంగా ఉంచినట్లు సమాచారం. పార్టీ అధినేతను ఎంపిక చేసే బాధ్యత కష్టంగా మారినందున ఆమెను కేబినెట్లో చేర్చుకోలేదని, అయితే విస్తరణలో ఆమెకు చోటు తప్పదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆమె మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న వ్యక్తి కావటం విశేషం.
Also Read: Rammohan Naidu: తండ్రి బాటలో రామ్మోహన్ నాయుడు: టీడీపీ ఎమ్మెల్యే బండారు