Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!
Modi Tour : ఈ పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని ముందుగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ద్వారా పర్యటనను ప్రారంభించనున్నారు.
- By Sudheer Published Date - 04:14 PM, Sat - 27 September 25

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లో(AP Tour) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని ముందుగా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ద్వారా పర్యటనను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కర్నూలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలిసి రోడ్షో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీ పర్యటన జరగడం, ముఖ్యంగా కూటమి నేతలతో కలిసి ర్యాలీ చేయడం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
Mahindra Scorpio: జీఎస్టీ తగ్గింపు తర్వాత మహీంద్రా స్కార్పియో ధరలు ఇవే!
ప్రధాని మోదీ పర్యటనలో జీఎస్టీ సంస్కరణలపై కూటమి నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించడం కీలక అంశంగా మారింది. ఈ ర్యాలీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కేంద్ర ఆర్థిక సంస్కరణలపై అవగాహన కల్పించడం, కూటమి పునాదిని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఈ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రవాణా రంగాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నాంది పలకనున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాజనకంగా చూస్తున్నాయి.
మంత్రి నారా లోకేశ్ ఈ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీలతో చర్చించడం ద్వారా అధికార వర్గాలు ప్రధాని పర్యటనకు ఉన్న ప్రాముఖ్యతను స్పష్టంచేశాయి. రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సహాయం, ప్రాజెక్టుల ఆమోదం, రాష్ట్ర-కేంద్ర సంబంధాల బలోపేతం వంటి అంశాల్లో ముఖ్య నిర్ణయాలు వెలువడవచ్చని అంచనా. దీంతో ఈ పర్యటన కేవలం ఆధ్యాత్మిక, రాజకీయ పరంగానే కాకుండా అభివృద్ధి దిశలో కూడా ఆంధ్రప్రదేశ్కు కీలకంగా మారనుందని భావిస్తున్నారు.