Midnight Arrests: చీకటి పాలనలో అర్ధరాత్రి అరెస్టులు..!
ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు.
- By Hashtag U Published Date - 10:41 AM, Sat - 9 September 23
By: డా.ప్రసాదమూర్తి
Midnight Arrests: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని పలు వార్తలు నిన్నటి నుంచి ఊపందుకున్నాయి. కారణాలు మాత్రం రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు, ఊహాగానాలు నిజమేనని చంద్రబాబుని శనివారం తెల్లవారుజామున అరెస్టు చేయించి అధికార వైసిపి నేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని, వేలకోట్ల లావాదేవీలు జరిగాయని, డిజైన్ టెక్ కంపెనీ లాంటి అనేక షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ధనం తరలింపు జరిగిందని, చంద్రబాబు మీద ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, ప్రతిదూషణలు, విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయాలలో సాధారణమే. అధికారంలో ఉన్నవారు అధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడానికి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని రకాల హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నైతిక విలువలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించడమే వారి వారి వ్యక్తిత్వాలకు నిదర్శనం అవుతుంది.
అయితే చీకట్లో, 70 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధ ప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లడం, ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అరెస్టు చేయడం అధికారంలో ఉన్న నాయకులకు సముచితమే అనిపించవచ్చు. కాని అదంతా కళ్లారా చూస్తున్న ప్రపంచానికి మాత్రం సంపూర్ణంగా అనైతిక అనుచిత ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగానే కనిపిస్తుంది. అరెస్టు చేసిన టైమింగ్ కీలకం. కుంభకోణం జరిగితే దానిమీద ఏం విచారణ జరిగింది, ఏ వాదోపవాదాలు జరిగాయి. ఏ ఆధారాల మీద దర్యాప్తులు సాగించారు, కేసు కొనసాగిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలు ఆలోచనకు వస్తాయి. ఏ విచారణలు కొనసాగినా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా నిద్రలో లేపి బేడీలు వేసి పట్టుకుపోవడం ఏమాత్రం సమర్ధనీయం కాదని చంద్రబాబు న్యాయవాదులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాదిస్తున్నారు. ప్రజాస్వామిక విలువల పట్ల నమ్మకం ఉన్నవారు జగన్మోహన్ చేసిన ఈ పని నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు
తెల్లవారితే శనివారం సెకండ్ సాటర్ డే. ఆ తరువాత ఆదివారం. రెండు రోజులు కోర్టులు ఉండవు. మేజిస్ట్రేట్ ముందు హాజరపరచడానికి జడ్జి గారు కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు. అంటే కనీసం రెండు రోజులైనా చంద్రబాబును పోలీసుల కస్టడీలో ఉంచి తమ కక్ష తీర్చుకోవాలని అధికార పార్టీ ఆత్రపడుతున్నట్టుగా కనిపిస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవజ్ఞుడు, 70 సంవత్సరాలు పైబడిన నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుని, చూడండి.. మేము కాబట్టి బందీ చేశాం అని అధికార పార్టీ చంకలు గుద్దుకోవచ్చు. ఇది ఆ పార్టీ అల్ప రాజకీయాలకు, చౌకబారు ధోరణికి అర్థం పడుతుంది. కానీ చుట్టూ ఇదంతా గమనిస్తున్న ప్రజలకు దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు మాత్రం తప్పనిసరిగా బోధపడతాయి.
అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆయన అనుచర గణం అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద దాడులు చేయడానికి ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. రాజకీయంగా దాడులు చేయడం వేరు భౌతికమైన దాడులు వేరు. అరెస్టులు, గృహ నిర్బంధాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిత్యకృత్యాలుగా మారిపోయాయి. జనం ఖాతాల్లో డబ్బులు వేయడం తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఏ రంగంలోనూ ఒక్క అడుగు ముందుకైనా పడలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలవరం విషయం గాని రాజధాని విషయం గాని ఏపీ ప్రత్యేక హోదా విషయం గానీ ఇలా అనేకానేక కీలక సమస్యలు పరిష్కారం కాలేదు. రోడ్లు వేయడం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం దాకా ఏ చిన్న పనీ జరగలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిష్ఫల పరిపాలనను తీవ్రంగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలు, నిర్వహిస్తున్న బహిరంగ సభలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఒకపక్క న్యాయస్థానాల నుంచి కూడా జగన్ సర్కారుకు ఏ విషయంలోనూ ఆమోదముద్ర లభించడం లేదు. కనుకనే జగన్ ఒక రకమైన పొలిటికల్ డిప్రెషన్ కి గురై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న చీకటి పాలనకు చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు అద్దం పడుతుంది.
Related News
Vallabhaneni Vamsi : వంశీ తన ఓటమిని ముందుగానే గ్రహించాడా..?
ఏపీ రాజకీయాలు అంటే గుర్తుకు వచ్చేవి వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగింది. ఈ సారి టీడీపీ కూటమి గెలిపించేందుకు ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రావాసులు తమ సొంతూళ్లకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.