Peddireddy : పెద్దిరెడ్డికి బిగ్ షాక్..కీలక అనుచరుడు అరెస్టు
Peddireddy : గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని ఆయన ఫాంహౌస్లో నిర్వహించిన దాడిలో మాధవరెడ్డిని అదుపులోకి తీసుకొని తిరుపతి సీఐడీ కార్యాలయానికి తరలించారు
- By Sudheer Published Date - 08:40 AM, Fri - 25 April 25

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహనం (Madanapalle Sub Collector Office Fire Accident) కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వంకమద్ది మాధవరెడ్డి(Madhav Reddy)ని సీఐడీ పోలీసులు అరెస్ట్ (CID Arrest) చేశారు. గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని ఆయన ఫాంహౌస్లో నిర్వహించిన దాడిలో మాధవరెడ్డిని అదుపులోకి తీసుకొని తిరుపతి సీఐడీ కార్యాలయానికి తరలించారు. గత ఏడాది జూలై 21వ తేదీన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రభుత్వం మారాక పెద్దిరెడ్డి, అతని అనుచరులు గతంలో పాల్పడ్డ భూ అక్రమాలకు సంబంధించిన కీలక ఫైళ్లను తొలగించేందుకు ఈ దహనం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
IPL Cheerleader Salary: ఐపీఎల్ చీర్ గర్ల్స్కు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
ఈ కేసులో మాధవరెడ్డి ప్రధాన సూత్రధారిగా గుర్తించబడిన నేపథ్యంలో క్రైమ్ నంబరు 138/2024 కింద మదనపల్లె వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఐడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు నుండి తప్పించుకునేందుకు మాధవరెడ్డి కొంతకాలం పరారీలో ఉండగా, ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే తాజాగా దర్యాప్తు బృందం ఆ బెయిల్ను రద్దు చేయించడంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, పూర్వపు ఆర్డీవో మురళి లాంటి అధికారులను అరెస్ట్ చేసిన సీఐడీ, ఇప్పుడు మాధవరెడ్డి అరెస్ట్తో మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తోంది. త్వరలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి వంటి కీలక నేతలపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. వైసీపీ హయాంలో భూముల కబ్జా, బెదిరింపులు, తప్పుడు కేసులతో ప్రజలను వేధించిన మాధవరెడ్డి ఇప్పుడు చట్టాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.