TDP Vs Jr.NTR : చంద్రబాబుకు తలనొప్పిగా జూనియర్ ‘సుభాషితం’
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియకుండా పార్టీలో కొన్ని విషయాలు పక్కదోవ పడుతున్నాయా? ఎవరు ఇలా చేస్తున్నారు?
- By CS Rao Published Date - 01:05 PM, Fri - 26 November 21
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియకుండా పార్టీలో కొన్ని విషయాలు పక్కదోవ పడుతున్నాయా? ఎవరు ఇలా చేస్తున్నారు? రాజకీయాలపై వాళ్ల అవగాహనా లోపమా? అత్యుత్సాహమా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. భువనేశ్వరి శీలంపై అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి జూనియర్ స్పందించిన తీరును కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. రెండు రోజులుగా ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్, పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన కామెంట్లు పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకెళ్లాయని తెలుస్తోంది. జూనియర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వెనుక పార్టీ కేంద్రం ఆఫీస్ లోని ఒక వర్గం ఉందని భావిస్తున్నారు. పార్టీకి జరుగుతోన్న డ్యామేజ్ ని గమనించిన చంద్రబాబు వాళ్లపై సీరియస్ అయ్యాడని తెలుస్తోంది.
రెండు పవర్ పాయింట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలే చర్చించుకోవడం కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. చంద్రబాబుకు తొలి నుంచి సీనియర్ల కోటరీ ఒకటి ఉంది. వాళ్లలో కొందరు ఏడాదిన్నర క్రితం బీజేపీకి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు బాబుకు అత్యవసరమైనప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. చంద్రబాబు కూడా వాళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటాడు. మీడియాకు లీకులు ఎవైనా ఇవ్వాల్సి వస్తే, వాళ్లే ఇస్తుంటారు. ఇలా చాలా కాలంగా టీడీపీలో జరుగుతోందని మీడియా వర్గాలు తెలుసు. ఇటీవల ఇలాంటి పద్దతిని చంద్రబాబుకు సమాంతరంగా పార్టీలోని మరో టీం అనుసరిస్తోందట.
ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు ప్రత్యేకంగా ఒక కోర్ టీం ఉందని పార్టీ అంతర్గత వర్గాల భావన. కొన్ని మీడియా సంస్థల అధిపతులు, కీలక రోల్ పోషించే ప్రెజెంటర్లను వాళ్లే నడిపిస్తుంటారని టాక్. కాబోయే సీఎం లోకేష్ అంటూ చాలా సందర్భాల్లో కొందరు మీడియా ముందు వెల్లడించారు. వాళ్లే ఆయన కోటరీలోని ప్రముఖలని ప్రచారం జరుగుతోంది. యువ నాయకులు కొందరు లోకేష్ కు ఒరిజినల్ గా క్లాస్ టచ్ ను మాస్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఆ క్రమంలోనే సీఎం జగన్ మీద కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా కవ్వించే వ్యాఖ్యలు చేశాడని ఆయన ఆంతరంగీకుల చెప్పుకుంటోన్న మాటలు. ఇప్పుడు భువనేశ్వరి విషయంలో జూనియర్ స్పందించిన తీరుపై ఆ టీం వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం.
Also Read : జూనియర్ పై టీడీపీ డైరెక్ట్ అటాక్!
జూనియర్ స్సందిస్తూ మాట్లాడిన మాటలను సుభాషితాలుగా అభివర్ణిస్తూ ఒక యాంకర్ తొలుత ఆయన షోలో నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టాడు. ఆ షో తరువాత సోషల్ మీడియా వేదికగా జూనియర్ కు వ్యతిరేకంగా ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత వర్ల, బుద్ధా డైరెక్ట్ గా అటాక్ చేశారు. ఇదంతా చంద్రబాబుకు తెలిసే లోపు పార్టీకి కొంత మేరకు డ్యామేజ్ జరిగిందని బాబు కోర్ టీం భావిస్తోంది. అందుకే, ఇప్పుడు బాబు రంగంలోకి దిగి జూనియర్ పై జరుగుతోన్న ప్రచారాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారట. అసెంబ్లీలో జరిగిన ఘటన రూపంలో వస్తోన్న సానుభూతి కాస్తా…జూనియర్ రూపంలో పక్కదోవ పడుతోందని చంద్రబాబు టీం అంచనా వేస్తోందట. తెలుగుదేశం పార్టీలో యూత్ ఎక్కువగా జూనియర్ సినిమాలకు అభిమానులు. పైగా కాబోయే సీఎం జూనియర్ అంటూ వాళ్లు భావిస్తుంటారు. ఇప్పుడు ఆయన మీద వ్యతిరేక ప్రచారం బయటకు రావడంతో జూనియర్ అభిమానులు కూడా ప్రతిగా స్పందిస్తున్నారు. ఇదంతా పార్టీకి నష్టం చేకూర్చుతుందని గ్రహించిన బాబు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారని తెలుస్తోంది. చంద్రబాబుకు తెలియకుండా టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఒక టీం ఇలా చేయడం భవిష్యత్ లో కూడా పార్టీకి మంచిది కాదని సీనియర్లు చర్చించుకోవడం కొసమెరుపు.
Also Read : “నాడు ఎన్టీఆర్..నేడు జగన్”..మండలి రద్దు..పునరుద్ధరణ చరిత్ర