Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రపై కన్నీళ్లు పెట్టుకున్న జేసీ
యువగలం పేరుతో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. పాదయాత్రలో లోకేష్ వెంట వందలాదిమంది ప్రజలు పాల్గొంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు
- Author : Vamsi Chowdary Korata
Date : 14-04-2023 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
Lokesh Padayatra: యువగలం పేరుతో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. పాదయాత్రలో లోకేష్ వెంట వందలాదిమంది ప్రజలు పాల్గొంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం లోకేష్ రాయలసీమలో పాదయాత్ర చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకున్న యువగలంలో భాగమయ్యారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో లోకేష్ వెంట నడిచిన ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి పాలనపై యుద్ధం ప్రకటిస్తూ నారా లోకేష్ యాదయాత్రకు పూనుకున్నారు. ఇప్పటికే వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు .ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర రాయలసీమ మీదుగా తాడిపత్రికి చేరుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి లోకేష్ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆయన కాళ్ళు బొబ్బలు ఎక్కి, అవి పగిలిపోతున్నాయి అని భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. లోకేష్ తన పాదయాత్రలో పడ్డ కష్టాలను చూస్తే బాధ కలిగించింది. లోకేష్ జీవితంలో ఇంతలా కష్టపడి ఉండడు. లోకేష్ బాబుకు ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయనకు డబ్బు లేదా?, కార్లు , విలాసవంతమైన జీవితం వదులుకుని ప్రజల కోసం రోడ్డుమీదకొచ్చారని కొనియాడారు జేసీ. లోకేష్ పరిస్థితి చూసి నాకే ఇలా ఉంటే , కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. లోకేష్ తల్లి, భార్యకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
తన కుమారుడు అస్మిత్ రెడ్డి యువగలం పాదయాత్రలో రెండు రోజులు పాల్గొన్నాడని, అయితే రెండు రోజులకే కుమారుడి కాళ్ళు నొప్పులొచ్చాయని లోకేష్ వందల కిలోమీటర్లు నడుస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని చెప్పారు. లోకేష్ కష్టజీవి, కర్మజీవి అంటూ కొనియాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి . ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రను ఇలాగే కొనసాగించాలని, ఎన్ని పరిస్థితుల్లో పాదయాత్రను ఆపొద్దన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
Read More: Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రపై బాలయ్య కామెంట్!.. వైసీపీలో భయం పుడుతోందట!