Pawan Kalyan: అభిమానులకు ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేస్తున్న జనసేనాని.. పవన్ ఆశ నెరవేరుతుందా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానన్న దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్రమంలో.. అభిమానులకు, జనసేన శ్రేణులకు ఓ విషయాన్ని పదేపదే గుర్తు చేస్తున్నారు.
- By News Desk Published Date - 10:09 PM, Thu - 15 June 23
జనసేన పార్టీ (Janasena party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. అధికార వైసీపీ (YCP) పై మాటల తూటాలు పేల్చుతున్నారు. వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) ను ప్రారంభించిన పవన్.. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని గెలవనివ్వనని చెబుతున్నాడు. అంతేకాదు.. అసెంబ్లీలో అడుగు పెడతానని.. ఈసారి అసెంబ్లీకి వెళ్లకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరని దీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పాదయాత్రలో, సభల్లో ఓ విషయాన్ని అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పదేపదే చెబుతున్నారు. ఆ విషయం ఏమిటంటే.. నాపై అభిమానం చూపిస్తున్నారు.. నాకు సంతోషంగా ఉంది. కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవటం లేదు. ఈసారి అలా చేయొద్దు అంటూ ఒకవిధంగా వేడుకుంటున్నారు.
జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యేనే విజయం సాధించారు. అతడుకూడా అధికార వైసీపీ పార్టీలోకి వెళ్లిపోయాడు. దీంతో జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యంకూడా లేకుండా పోయింది. గత ఎన్నికల సమయంలోనూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అంటే జనం కిక్కిరిసిపోతున్నారు. కానీ, ఎన్నికల సమయంలో మాత్రం వాటిని ఓట్లరూపంలో మార్చుకోలేక పోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్కు నిద్రలేకుండా చేస్తుందట. గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ రెండు స్థానాల్లోనూ పవన్ ఓడిపోవటం జనసేన శ్రేణులను ఆందోళనకు గురిచేసింది.
వచ్చే ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తానంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈసారి నన్ను అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని, ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతానని పవన్ దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. జనసేన శ్రేణులకు, అభిమానులకు ఓ సూచన చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తాయని ప్రచారం జరుగుతుంది. వీరికితోడు బీజేపీకూడా కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా జనసేన, పవన్ అభిమానుల ఓట్లతోపాటు టీడీపీ ఓట్లు కలిస్తే విజయం నల్లేరుపై నడక అవుతుందని పవన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో ఈసారి తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరూ ఆపలేరని దీమాతో ఉన్నారని ఏపీలో ప్రచారం జరుగుతుంది.
Related News
Pawan Kalyan : మావయ్య గెలుపు కోసం రంగంలోకి దిగిన తేజు
ఈరోజు మచిలీపట్నం లో ప్రచారం చేసారు..రేపు మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు