Janasena: మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే ‘జనసేన’ లక్ష్యం!
మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
- By Hashtag U Published Date - 05:45 PM, Fri - 25 March 22
మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుందని వివరించారు. ప్రతి జిల్లాలో మహిళలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని, క్షేత్రస్థాయిలో నిస్వార్ధంగా పనిచేసే వీరమహిళలకు కమిటీల్లో పెద్దపీట వేస్తామని చెప్పారు. వీరమహిళ విభాగం ప్రాంతీయ కమిటీలతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు నాదెండ్ల మనోహర్. పార్టీ పరంగా చేయనున్న భవిష్యత్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ 70 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. శ్రమను ఎక్కువగా ధారపోసేది వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనుల్లోనే. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా , కష్టాలకు ఓర్చి, కన్నీటిని దిగమింగి కన్నబిడ్డల చదువుల కోసం ఆరుగాలం కష్టపడుతుంటారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని వాటిని ఠంచనుగా చెల్లించడంలోనూ మన రాష్ట్ర మహిళలదే రికార్డు అని అన్నారు నాదెండ్ల మనోహర్.
ఆర్గానిక్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్ ను ప్రోత్సహించండి
మహిళ అభ్యున్నతికి జనసేన పార్టీ వీర మహిళ విభాగం కృషి చేయాలి. ఇందులో భాగంగా గ్రామాల్లో ఆర్ధికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి వారికి అన్ని రకాలుగా సాయపడుతూ స్వశక్తితో నిలబడే విధంగా కృషి చేయాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్గానిక్ ఫార్మింగ్, పూలు, కూరగాయల పెంపకం, గ్రీన్ హౌస్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఏడాది వారికి రూ. 75 వేల నుంచి లక్ష రూపాయలు అదనపు ఆదాయం సమకూరేటట్లు చేయాలి. జిల్లాకో గ్రామంలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి. అవసరమైతే ఆదర్శ రైతుల అనుభవాలు, సైంటిస్టుల సలహాలను కూడా తీసుకొని మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా బాధ్యతలు తీసుకోవాలి. వారం రోజుల్లో దీనిపై ప్లాన్ రెడీ చేసుకోవాలని సూచించారు జనసేన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల.
నిస్వార్ధ వీర మహిళలకు పెద్దపీట
ప్రతి జిల్లా అధ్యక్షుడికి ఒక కమిటీ ఉన్నట్లు.. ప్రతి జిల్లా మహిళా అధ్యక్షురాలికి కూడా ఒక కమిటీ ఉంటుంది. జిల్లా మహిళ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఎవరనేది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు నాదెండ్ల. కష్టపడే మనస్తత్వం, పనితీరు, మండలాల్లో పర్యటిస్తారా? లేదా? పార్టీ కోసం ఎంత వరకు సమయం కేటాయించగలరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా మహిళ అధ్యక్షులు, మండల అధ్యక్షుల నియామకాలు జరుగుతాయి. ముఖ్యంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్ధంగా పనిచేసే వీర మహిళలకు ఈ కమిటీల్లో పెద్దపీట వేస్తాం. మహిళల పనితీరును బట్టి వారిని కేవలం మహిళా కమిటీలకే పరిమితం చేయకుండా మెయిన్ కమిటీల్లో కూడా స్థానం కల్పిస్తాం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ నియమాకాలు ఉంటాయి అని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్.
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.