Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!
Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు
- Author : Sudheer
Date : 03-08-2025 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Chandrababu , Nitin Gadkari , Pawan) రాష్ట్రంలో రూ. 5233 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సంపద సృష్టికి రహదారులే ముఖ్యమని అభివర్ణించారు. రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు. గతంలో గడ్కరీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఊపిరి పోశారని చంద్రబాబు గుర్తు చేశారు.
చంద్రబాబు గత ఐదేళ్లలో ఏపీలోని రాష్ట్ర రహదారులు శిథిలావస్థకు చేరాయని, అయితే జాతీయ రహదారులు మాత్రం బాగున్నాయని పేర్కొన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం అవి 8745 కిలోమీటర్లకు చేరాయని తెలిపారు. రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాదిలో 1000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గడ్కరీ స్ఫూర్తితోనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను నిర్మించామని, ఇప్పుడు అమరావతికి కూడా 189 కిలోమీటర్ల ORRను మంజూరు చేయమని కోరగా, దానికి గడ్కరీ అంగీకరించారని చంద్రబాబు వెల్లడించారు.
RBI MPC Meet: రాఖీ పండుగకు ముందు శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. ఏంటంటే?
అమరావతి ORR ఏడు జాతీయ రహదారులను కలుపుతుందని, విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం సహాయాన్ని కోరారు. పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాలను రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటుందని, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీపై గడ్కరీ సూచనలతో ప్రతి ఇంటిపై విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు నెరవేరాలంటే రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, అంతర్గత జలమార్గాలపై దృష్టి పెట్టాలని ఆయన ఉద్ఘాటించారు. దక్షిణాదిలో అమరావతి-చెన్నై-బెంగళూరులను కలుపుతూ బుల్లెట్ రైలును కోరారు, అలాగే జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంచడానికి నిధులు కేటాయించాలని కోరారు.
చంద్రబాబు కోరిన వెంటనే గడ్కరీ మంజూరు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు: హైదరాబాద్-విజయవాడ ఆరు లేన్ల రహదారి (రూ. 6700 కోట్లు), విజయవాడ-మచిలీపట్నం ఆరు లేన్ల రహదారి (రూ. 2600 కోట్లు), వినుకొండ-గుంటూరు నాలుగు లేన్ల రహదారి (రూ. 2605 కోట్లు), గుంటూరు-నిజాంపట్నం నాలుగు లేన్ల రహదారి (రూ. 2000 కోట్లు), బుగ్గకాయిప-గిద్దలూరు నాలుగు లేన్ల రహదారి (రూ. 4200 కోట్లు), ఆకివీడు-దిగమర్రు నాలుగు లేన్ల రహదారి (రూ. 2500 కోట్లు), పెడన-లక్ష్మీపురం నాలుగు లేన్ల రహదారి (రూ. 4200 కోట్లు), ముద్దనూరు-కడప నాలుగు లేన్ల రహదారి (రూ. 1182 కోట్లు), మరియు హైదరాబాద్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనవి.