Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..
- Author : Vamsi Chowdary Korata
Date : 17-06-2026 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో ప్రస్తుతం 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే, భార్యకు తక్షణమే ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పెన్షన్ బదిలీ చేస్తున్నామని, దీనివల్ల ఇప్పటికే 2.45 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు.
పింఛన్ల తొలగింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 9.56 లక్షల పింఛన్లను తొలగిస్తే… తాము కేవలం నిబంధనల ప్రకారమే 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే తొలగించామని, దివ్యాంగులు, రోగుల పింఛన్లను ఎక్కడా రద్దు చేయలేదని మంత్రి తేల్చి చెప్పారు.