Free Petrol : తిరుపతిలో ఫ్రీగా పెట్రోల్.. క్యూ కడుతున్న వాహనదారులు
గతంలోనూ తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన క్రైసిస్ దృష్ట్యా సామాన్యుల కష్టాలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 27-04-2026 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న ఈ కష్టకాలంలో తిరుపతిలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. నగరంలోని తనపల్లి ప్రాంతంలో ఉన్న ఒక పెట్రోల్ బంకులో వాహనదారులకు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో దర్శనమిస్తుంటే, ఇక్కడ మాత్రం ఉచితంగా ఇంధనం పోస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో నగరంలోని వాహనదారులందరూ ఒక్కసారిగా ఆ బంకు వైపు పరుగులు తీశారు.
బంకు వద్ద భారీ క్యూలు
ఉచిత పెట్రోల్ వార్త తెలియగానే తనపల్లి బంకు వద్దకు ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. ప్రతి టూ వీలర్కు ఒక లీటర్ పెట్రోల్ను ఎటువంటి చార్జీలు లేకుండా పోస్తుండటంతో, వాహనదారులు ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. ఒక్కసారిగా వందలాది వాహనాలు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంధన సంక్షోభం కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఈ ఉచిత పంపిణీ తమకు పెద్ద ఊరటనిచ్చిందని స్థానిక వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యజమాని రాజేష్ రెడ్డి
ఈ వినూత్న కార్యక్రమంపై బంకు యజమాని రాజేష్ రెడ్డి స్పందిస్తూ.. ఇది కేవలం ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. గతంలోనూ తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన క్రైసిస్ దృష్ట్యా సామాన్యుల కష్టాలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు పెట్రోల్ విక్రయిస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇలా ఉచితంగా పెట్రోల్ అందించి రాజేష్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ఈ చర్యపై నెటిజన్లు మరియు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
