Borugadda Anil Arrest: బోరుగడ్డకు బిర్యానీ.. ఏడుగురు పోలీసులు సస్పెండ్!
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఎస్కార్ట్ పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓ లగ్జరీ హోటల్కు తీసుకెళ్లి చికెన్, మటన్తో నాన్ వెజ్ భోజనం అందించారు. ఈ ఘటన పోలీసు పెద్దల దృష్టికి వచ్చి, వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
- By Kode Mohan Sai Published Date - 01:01 PM, Thu - 7 November 24

బోరుగడ్డ అనిల్కుమార్, అతను రౌడీషీటర్గా పేరుగాంచాడు. నోటికి అడ్డూ అదుపు ఉండేది కాదు. బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తూ పేట్రేగిపోయాడు. ఎంతగానో ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఫోన్లు చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. గతంలో, విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లను అసభ్య పదజాలంతో దూషించాడు. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుగా వ్యాఖ్యానించాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం పండింది.
రాష్ట్రంలో గవర్నమెంట్ మారడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. అయితే, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అనిల్కుమార్ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు అతడిని ఓ వీఐపీలా ట్రీట్ చేశారు. లగ్జరీ రెస్టారెంట్లో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విషయం ఏపీ స్టేట్ పోలీస్ బాస్కు తెలియడంతో, విచారణ చేపట్టారు. ఈ ఘటన ఘటనకు పాల్పడిన 7 మంది పోలీసులను సస్పెండ్ చేసారు.
బోరుగడ్డ అనిల్కుమార్ పై తుళ్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి, పోలీసులు బుధవారం అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకువచ్చి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ పూర్తయ్యాక, మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి రాజమండ్రికి పయనమయ్యారు.
బోరుగడ్డ అనిల్కుమార్ ను జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ టీమ్గా గుంటూరు జిల్లా ఏఆర్కు చెందిన RSI పి.నారాయణరెడ్డి నేతృత్వంలో, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, ఏఆర్ కానిస్టేబుళ్లు టి.శంకరరావు, కె.బుచ్చయ్య, తాడికొండ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.ఏ.సద్దులా, తుళ్లూరు పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లు బాల ఎం.శౌరి, నాగరాజు ఉన్నారు.
రూల్స్ ప్రకారం, రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్కుమార్ కు వాహనంలోనే ఆహారం అందించాల్సి ఉంటుంది. కానీ, పోలీసు అధికారులు అతడిని వీఐపీలా ట్రీట్ చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి, అనిల్ను దర్జాగా లోపలికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి మాంసాహార భోజనం ఇచ్చారు. అతనితో పాటు ఎంచక్కా లంచ్ కూడా చేశారు. అందరూ కలిసి విందు భోజనం చేసిన తరువాత, బిల్ను అనిల్ చెల్లించినట్టు గమనించవచ్చు.
రౌడీ షీటర్కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్లిన పోలీసులు.అతనితో సరదాగ మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించిన పోలీసులు.#borugaddaanil pic.twitter.com/nmdjOnpbFH
— Hashtag U (@HashtaguIn) November 7, 2024
ఇక, ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో షూట్ చేస్తోన్న వారిని పోలీసులు బెదిరించి, వీడియోలను డిలీట్ చేయించారు. విషయం తెలుసుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలోనే సంబంధిత పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత, వారిపై చర్య తీసుకోబడింది.