AP Intermediate Results: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ నమోదు. నారా లోకేష్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఫస్టియర్లో 77 శాతం మంది విద్యార్థులు (3,61,526) పాసవ్వగా.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థులు (3,59,816) ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఫస్టియర్లో బాలురు 72 శాతం, బాలికలు 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో బాలురు 76 శాతం, బాలికలు 85 శాతం పాసయ్యారు. ఒకేషనల్ కోర్సులో ఫస్టియర్ లో 61%, సెకండియర్ లో 74% మంది పాసయ్యారు.
మంత్రి కృషితో 12 ఏళ్ల తరువాత
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు, అమలుచేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఇంటర్లో మెరుగైన ఫలితాలు
మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.
రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.
ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో..
మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి.
రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా తొలి ఏడాది 54 శాతం మంది, ద్వితీయ సంవత్సరం 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని లోకేశ్ అన్నారు. ఇది విద్యార్థులు, ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్ల కష్టానికి ఫలితమని కొనియాడారు.
ఫలితాలను చెక్ చేసుకునే విధానం:
వెబ్సైట్: విద్యార్థులు resultsbie.ap.gov.in లో తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
వాట్సప్: 9552300009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపి, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా రిజల్ట్ వాట్సప్కే వస్తుంది.
Results for the Intermediate Public Examinations are now out.
Students can check their results online at https://t.co/UDtk11c781. Also, results can be accessed by sending a “Hi” message to the Mana Mitra WhatsApp number at 9552300009.
Glad to share that this year’s IPE results…
— Lokesh Nara (@naralokesh) April 15, 2026
ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని, సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుదలతో చదివి పాస్ కావాలని సూచించారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మానసిక మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.