AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
- Author : Latha Suma
Date : 17-05-2024 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టిమ్ సిట్(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక సిట్ ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, , చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు చేయనుంది. అయితే తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఏపీ సర్కార్.
We’re now on WhatsApp. Click to Join.
తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు….రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే వేటు వేసింది ఈసీ. ఇక అటు జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది ఇంటెలిజెన్స్. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది ఇంటెలిజెన్స్.
Read Also: Warm-Up Schedule: బంగ్లాదేశ్తో టీమిండియా వార్మప్ మ్యాచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. గురువారం వారితో భేటీ అయింది. ఎన్నికల వేళ ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఈసీ.. ఈ భేటీ తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగిందని.. దాన్ని నియంత్రించేందుకు స్థానిక అధికారులు పూర్తిగా విఫలం అయినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.