AP EAPCET Results: ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా
- Author : Vamsi Chowdary Korata
Date : 30-06-2026 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు రిజల్ట్స్ అని చెప్పగానే విద్యార్థులు ఫోన్లు పట్టుకుని కూర్చుంటే.. రిజల్ట్ న్యూస్ కాకుండా వాయిదా వార్త బయటకు వచ్చాక ఉసూరుమంటూ ఊరుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించగా.. అధికారులు మాత్రం ఇవాళ ఎలాంటి రిజల్ట్స్ లేవని చెప్పేశారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున ఎప్సెట్ ఫలితాలు వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 2న ఫలితాలు విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ, ఆ రోజు అయినా విడుదల చేస్తారా? లేదా? అన్న స్పష్టత లేదు. దాంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు.
అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీకే ఈ ఫలితాలు వెలువడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తమ కారణాలు చెబుతూ ఫలితాలను వాయిదా వేసింది. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉండటంతో సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వచ్చే వరకూ ఆగాలని ఇలా రెండుసార్లు ఫలితాలను ప్రభుత్వం వాయిదా వేసింది.
ఏపీ ఎప్సెట్ ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫలితాలే విడుదల కాకపోవడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. ఆ తేదీ కూడా గ్యారెంటీ అని చెప్పలేకపోతున్నారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ ఎప్సెట్ 2026కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.