Andhra Pradesh TDP : ఏపీ టీడీపీకి ఎసరు.!
బీజేపీ `రోడ్ మ్యాప్` మీద ఏపీ రాజకీయం ఆధారపడి ఉంది. రెండు శాతం ఓటు బ్యాంకు కూడా లేని కమలం పార్టీ చదరంగం ఆడుతోంది.
- By CS Rao Published Date - 01:43 PM, Tue - 15 March 22
బీజేపీ `రోడ్ మ్యాప్` మీద ఏపీ రాజకీయం ఆధారపడి ఉంది. రెండు శాతం ఓటు బ్యాంకు కూడా లేని కమలం పార్టీ చదరంగం ఆడుతోంది. దానిలో జనసేనాని పవన్ ఒక `పవర్` ప్లేయర్ గా మారాడు. ఢిల్లీ నుంచి బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగా నడుచుకుంటానని బాహాటంగా ఆవిర్భావ సభలో పవన్ ప్రకటించాడు. ప్రజా ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేస్తానంటూనే అంతా బీజేపీపై ఆధారపడి ఉందని చెబుతున్నాడు. జగన్ సర్కార్ ను కూల్చడానికి వైసీపీ వ్యతిరేకశక్తులను కూడగడతానని ప్రకటించాడు. రాజకీయ పార్టీలన్నింటినీ టచ్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగం వైసీపీలో అలజడి రేపుతుండగా, టీడీపీ మాత్రం పవన్ స్పీచ్ ను సానుకూలంగా భావిస్తోంది.ప్రస్తుతం ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ లు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని పవన్ భావన. మరో కొత్త పార్టీ బ్రదర్ అనిల్ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అది కూడా జగన్ కు వ్యతిరేకంగా పుట్టుకొస్తోన్న పార్టీనే. వీటన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం జనసేనానికి ఎలా సాధ్యం? అనేది పెద్ద ప్రశ్న. వాస్తవంగా కమ్యూనిస్ట్ లు, బీజేపీ ఒక వేదికపైకి రావడం అసాధ్యం. ఇక బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయడం అసంభం. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన మాత్రమే వ్యతిరేకశక్తులు. ఒక వేళ జనసేనాని పవన్ బీజేపీతో కటీఫ్ అయితే కమ్యూనిస్ట్ లు, కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంది. సో..వైసీపీ వ్యతిరేక శక్తులు ఏపీలో ఒక వేదికపైకి రావడం పవన్ కు ఒక కల మాదిరిగా మిగులుతుంది.
ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం..రాజ్యాధికారమే లక్ష్యమంటూ పవన్ చేసిన స్పీచ్ టీడీపీకి నిదానంగా బోధపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న జనసేనకు మద్ధతు ఇవ్వాలని చంద్రబాబును పరోక్షంగా కోరుతున్నాడు. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా పవన్ చేసిన ప్రసంగం అద్భుతం అంటూ ప్రశంసిస్తోన్న టీడీపీకి నిదానంగా జనసేనాని స్పీచ్ లోని ఆంతర్యం బోధపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్టీ బలం పుంజుకుందని పవన్ అంచనా వేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కంటే ఏ మాత్రం తీసిపోని విధంగా పోటీ ఇస్తున్నామన్న భావన జన సైనికుల్లో కలిగించాడు. స్థానిక ఎన్నికల బరిలో టీడీపీ లేకపోవడంతో జనసేన వైపు టీడీపీ క్యాడర్ చాలా చోట్ల సర్దుకుంది.2009 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఆ రోజు నుంచి తెలంగాణలో పతనం మొదలైయింది. ఆ ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీ లీడర్లు, క్యాడర్ ఈజీగా గులాబీ దళంలో కలిసి పోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ తో పోరాడిన టీడీపీ లీడర్లు, క్యాడర్ మరో టీడీపీ పార్టీగా టీఆర్ఎస్ ను భావించడం తేలిక అయింది. సీన్ కట్ చేస్తే…2014 తరువాత తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఇంచుమించు ఒకే భావజాలం ఉన్న టీఆర్ఎస్ పార్టీతో ఈజీగా టీడీపీ క్యాడర్ మిళితం అయింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొంది.
జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు ఈజీగా కలిసిమెలిసి పనిచేయడానికి అనువైన రాజకీయ వాతావరణం ఉంది. పరస్పరం సహకారం చేసుకున్న చరిత్ర కూడా ఆ పార్టీలకు ఉంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా గళం విప్పిన పార్టీలుగా ఆ మూడింటికి అనుభవం ఉంది. భావజాలం పరంగా కూడా ఇంచుమించు ఒకేలా బీజేపీ, టీడీపీ, జనసేనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఎవరికి లాభం ? అనే ప్రశ్న వేసుకుంటే, 2009లో టీఆర్ఎస్ లాభపడిన ఎపిసోడ్ ను ఉదాహరణగా తీసుకోవచ్చు.జనసేనతో పోల్చుకుంటే తెలుగుదేశం గ్రాండ్ ఓల్డ్ పార్టీగా యూత్ దృష్టిలో ఉంది. పైగా చంద్రబాబు ఎత్తుగడలు, ఆయన పాలన చూసిన ఆ పార్టీలోని క్యాడర్ విసిగెత్తిన సందర్భాలు లేకపోలేదు. యువ రక్తంతో ఉరుకలెత్తుతోన్న జనసేన లేకుండా గెలువలేమనే సంకేతం చంద్రబాబు ఇప్పటికే ఇచ్చేశాడు. వన్ సైడ్ లవ్ అంటూ జనసేనకు లేని బలాన్ని చంద్రబాబు క్రియేట్ చేశాడు. దీంతో జనసేన వైపు టీడీపీ క్యాడర్ చూపు పడింది. పైగా పవన్ కు వస్తోన్న స్పందన ఆనాడు కేసీఆర్ సభలకు వచ్చిన తీరుగా ఉంది. ఇవన్నీ క్రోడీకరించి చూస్తే…జనసేన రూపంలో టీడీపీకి ప్రమాదం పొంచి ఉందని భావించడంలో తప్పులేదు.
ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ జనసేనాని చేసిన శపథం వెనుక చంద్రబాబు మద్ధతుతో సీఎం కావాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజ్యాధికారమే లక్ష్యమంటూ నాగబాబు కూడా అదే వేదికపై నుంచి చెప్పాడు. అంటే,
సీఎం కావడానికి మద్ధతు ఇవ్వాలని పరోక్షంగా బీజేపీ, టీడీపీలతో పాటు వైసీపీ వ్యతిరేక శక్తులకు పవన్ పిలుపు ఇచ్చాడు. ఆ మేరకు బీజేపీ రోడ్ మ్యాప్ ఉందని కూడా ఆయన చెబుతున్నాడు. రాబోవు రోజుల్లో అమిత్ షా రంగంలోకి దిగబోతున్నాడు. మోడీ, షా ద్వయం చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఏ మాత్రం అంగీకరించరని బీజేపీ చెబుతోంది. సో..రోడ్ మ్యాప్ లో చంద్రబాబును వాడుకుని రాజ్యాధికారం ఎలా? అనే దానిపై బీజేపీ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే, పవన్ ఆవిర్భావ సభ ప్రసంగంలోని ఆంతర్యం ఇప్పుడిప్పుడే టీడీపీకి బోధపడుతోంది.మొత్తం మీద ఆవిర్భావ సభతో వైసీపీ, టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో జనసేన చదరంగం మొదలు పెట్టింది. దానికి ఒక స్పష్టత రావాలంటే అమిత్ షా దండయాత్ర రోడ్ మ్యాప్ బయటకు రావాల్సిందే.!
Tags
Related News
Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..
ఆమె కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి చంద్రబాబుని సహాయం అడిగారు. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఆసక్తికర కామెంట్స్..