Vande Bharat – AP : 12 నుంచి ఏపీకి మరో ‘వందేభారత్’.. హాల్టింగ్ స్టేషన్లు ఇవీ
Vande Bharat - AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది.
- Author : Pasha
Date : 08-03-2024 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Bharat – AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్ వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ రోజున వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ను ఇవాళ (శుక్రవారం) నిర్వహించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త వందేభారత్ ట్రైన్పై మరిన్ని వివరాలు ఇవీ..
We’re now on WhatsApp. Click to Join
- ‘భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్’ వందేభారత్ రైలు సోమవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది.
- మొత్తం 443 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణిస్తుంది.
- ప్రతిరోజు ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. ఖుర్ధారోడ్కు 5.33 గంటలకు, బరంపూర్కు 7.05 గంటలకు, ఇచ్ఛాపురంనకు 7.18 గంటలకు, పలాసకు 8.18 గంటలకు, శ్రీకాకుళం రోడ్ (ఆముదాలవలస)కు 9.03 గంటలకు, విజయనగరంనకు 9.48 గంటలకు, విశాఖపట్నానికి ఉదయం 11 గంటలకు చేరుతుంది.
- విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. విజయనగరంనకు 4.30 గంటలకు, శ్రీకాకుళం రోడ్కు 5.28 గంటలకు, పలాసకు 6.30 గంటలకు, ఇచ్ఛాపురంనకు 7.00 గంటలకు, బరంపూర్కు 7.20 గంటలకు, ఖుర్ధారోడ్కు 8.57 గంటలకు, భువనేశ్వర్కు 9.30 గంటలకు రైలు చేరుకుంటుంది.
- ప్రతి రైల్వేస్టేషన్ వద్ద ఈ రైలు రెండు నిమిషాలు ఆగుతుంది.
Also Read : Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?
- ప్రస్తుతం వందేభారత్ రైళ్ల బోగీలను చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో వారానికి ఒక బోగీ మాత్రమే తయారవుతోంది.
- రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు తొలుత అంగీకరించిన కేంద్రం.. ఆ తర్వాత మాట మార్చింది. కాజీపేటలో ఆర్సీఎఫ్ను ఏర్పాటు చేయడం లేదని ప్రకటించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది.
- కాజీపేటలో ఆర్సీఎఫ్ను ఏర్పాటు చేసినట్టయితే వందేభారత్తోపాటు ఇతర రైళ్ల బోగీలను వేగంగా తయారు చేసేందుకు వీలయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణకు మొండిచెయ్యి
రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తామని నిరుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 50 రైళ్లను కూడా ప్రారభించలేదు. వందేభారత్ రైళ్ల విషయంలో కేంద్రం దక్షిణ మధ్య రైల్వే జోన్కు తీవ్ర అన్యాయం చేస్తున్నది. ఉత్తర భారతావనిలోని వివిధ ప్రాంతాల మధ్య అనేక వందేభారత్ రైళ్లను నడుపుతున్న నరేంద్రమోడీ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 రైళ్లను ప్రారంభించి చేతులు దులిపేసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో అత్యంత కీలకమైన హైదరాబాద్/సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.