Viveka Murder Case: రోజుకో మలుపు తిరుగుతున్న వివేక హ్యత కేసు
- By HashtagU Desk Published Date - 11:09 AM, Thu - 24 February 22

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్యకేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్గా మారి కడప కోర్టు ముందు ఉంచిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఇక దస్తగిరి ఇచ్చి వాంగ్మూలంతో పాటు తాజాగా సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారని, అప్పటికీ తాను లొంగలేదని సీఐ శంకరయ్య సీబీఐకి చెప్పడం హాట్ టాపిక్గా మారింది.
అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చారని సీఐ శంకరయ్య స్పష్టం చేశారు. వివేకా హత్య జరిగిన రోజు శాంతి భద్రతల సమస్య తలెత్తుతాయనే కారణంతో మొదట హత్యా నేరం, ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలేదని సీఐ శంకరయ్య తెలిపారు. అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, ఎర్ర గంగిరెడ్డి వివేకా వద్ద పీఎస్గా పనిచేశారని సీబీఐ అధికారులకు వివరించారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసని స్పష్టం చేశారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డిల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందని సీఐ శంకరయ్య తెలిపారు.
మరోవైపు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు ఆయన న్యాయవాది ఓబుల్ రెడ్డి వచ్చి తనకు డబ్బు ఆశా చూపించారని, తమ మాట వింటే తగినంత డబ్బు ఇస్తామని, పది ఎకరాల భూమి కూడా ఇప్పిస్తామని చెప్పినట్లు దస్తగిరిని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలాలు పరిశీలిస్తే, ఎంపీ అవినాష్ రెడ్డి చుట్లు ఉచ్చు బిగిసుకునేలా ఉన్నాయి. ఇక మరోవైపు వివేకా హత్యకేసులో నింధితులో శంకర్ రెడ్డి, గంగిరెడ్డి వేర్వేరుగా వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మమ కడప పులివెందులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈకేసులో మరో షాకింగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలు ఉన్నాయని తులసమ్మ వ్యాజ్యంలో పేర్కొంది. షేక్ షమీమ్ అనే మహిళను వివేకానంరెడ్డి రహస్య వివాహం చేసుకున్నారని, వారికి ఓ బాబు కూడా ఉన్నారని తులసమ్మ పిటిషన్లో పేర్కొంది. రహస్య భార్య షమీమ్కు రెండు కోట్ల ఆస్తిని కూడా ఇవ్వాలని వివేకా భావించడంతో కుటుంబంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తులసమ్మ తెలిపింది.
దీంతో గత కొన్నేళ్ళుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తే, అల్లుడు వద్ద హైదరాబాద్లో ఉంటున్నారని, వివేకానందరెడ్డి ఒక్కరే పులివెందులో ఉంటున్నారని చెప్పింది. మొదట ఈ కోణంలోనే వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ను అడ్డుకునేందుకు వేకా భార్య సౌభాగ్యమ్మ, ఆ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేసిందని తులసమ్మ ఆరోపించింది. ఇక వివేకా హత్య కేసులో పలువురి పాత్ర ఉందని చెప్పిన తులసమ్మ.. వివేకా అల్లుడు, చిన బావమరిది రాజశేఖర్ రెడ్డి, పెద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డితో పాటు కొమ్మా పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రసాద్ల పాత్ర ఉందని, వారిని సీబీఐ విచారించాలని తులసమ్మ విజ్ఞప్తి చేసింది. మరి రోజుకో మలుపు తిరుగుతున్న వివేకా హ్యత కేసులో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి.