ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
- Author : Vamsi Chowdary Korata
Date : 27-12-2025 - 10:59 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
- ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
- గుంతకల్లు దగ్గర నిర్మాణ పనులు వేగవంతం
- రూ.350 కోట్లతో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మాణం చేయనున్నారు. ఈ రైల్ ఓవర్ రైల్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింది. ఈ పైవంతెన సుమారు పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణం పూర్తయితే, బళ్లారి, డోన్ మధ్య రైలు ప్రయాణం చాలా సులభం అవుతుంది. అంతేకాకుండా, గుంతకల్లు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే రైళ్లకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పైవంతెన నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.
గుంతకల్లు రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పైవంతెన ప్లాన్ చేశారు. ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే రైళ్లు, గూడ్సులు ఒకే మార్గం నుంచి స్టేషన్లోకి రావాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. ఈ రైల్ ఓవర్ రైల్ పైవంతెన నిర్మాణం పూర్తయితే, బళ్లారి, ఆదోని, డోన్ మార్గాల నుంచి వచ్చే కొన్ని రైళ్లు, గూడ్సులు స్టేషన్లో ఆగకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి వంతెనను ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరులో నిర్మించారు. మరొకటి విజయవాడలో నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు చిప్పగిరి గుంతకల్లు మధ్యలో నిర్మిస్తే ఇది మూడవ పైవంతెన అవుతుంది. ఈ నిర్మాణంతో రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయని భావిస్తున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల నుంచి రోజూ గుంతకల్లు రైల్వే జంక్షన్కు 58 ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 100కుపైగా గూడ్సు రైళ్లు కూడా వస్తుంటాయి. అయితే స్టేషన్లో ఏడు ప్లాట్ఫారాలు మాత్రమే ఉండటంతో.. గూడ్సులు స్టేషన్లో నిలిచిపోవడం వల్ల ప్లాట్ఫారాలు ఖాళీగా ఉండటం లేదు. గూడ్సులు స్టేషన్లోకి రావడం వల్ల ప్లాట్ఫారాలు ఖాళీలేక రైళ్లను స్టేషన్ బయట గంటల తరబడి నిలపాల్సి వస్తోంది. ఫలితంగా ఆలస్యం కావడమేకాక రైళ్లలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, రైల్వే ఇంజినీర్లు బైపాస్ రైల్వే మార్గాలు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణాన్ని సూచిస్తూ నివేదికలు సమర్పించారు. ఈ నిర్మాణాల వల్ల ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులుపడుతున్నాయి.