AP BJP protest: రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు: సోమువీర్రాజు
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
- Author : HashtagU Desk
Date : 28-08-2022 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం ఆన్లైన్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి పండుగకు సంబంధించి కాన్పుల అనుమతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
నిరసన అనంతరం తహశీల్దార్లకు వినతిపత్రాలు అందించాలని సూచించారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాల్లో నిబంధనల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన ఖండించారు. ఆంక్షలు విధించి వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులను నిరుత్సాహపరిచి రాష్ట్రవ్యాప్తంగా మండపాల సంఖ్యను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వినాయక చవితి ఉత్సవాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే సింగిల్ విండో విధానంలో అనుమతి ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.