Amit Shah : జగన్ ప్రభుత్వంపై అమిత్షా ఫైర్.. ఏపీలో రూట్మార్చిన బీజేపీ
టీడీపీతో కలిసి ముందుకెళ్లే విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వనప్పటికీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఏపీ జోరుగా సాగుతుంది.
- By News Desk Published Date - 10:15 PM, Sun - 11 June 23
కేంద్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం పెద్దల అండదండలు మాకున్నాయని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి(AP CM Jaganmohan Reddy) కేంద్ర మంత్రి అమిత్షా(Amit Shah) షాకిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం విశాఖ(Vizag) పట్టణంలోని రైల్వే గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో అమిత్ షా పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, అన్నదాత ఆత్మహత్యలు ఆపని జగన్ సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అమిత్షా తాజా వ్యాఖ్యాలతో ఏపీలో బీజేపీ రూట్ మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో బీజేపీ పెద్దలు ఏపీలో సీఎం జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి రావటంలో కీలక భూమిక పోషించారనడంలో అతిశయోక్తి లేదు. బీజేపీ పెద్దల నుంచి సహకారం అందడంతోనే ఏపీలో రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అంతేకాక భారీ సంఖ్యలో ఎంపీ స్థానాలను వైసీపీ గెలుపొందింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞత చూపుతూ వస్తున్నారు. ఏపీలోని వైసీపీ నేతలు సైతం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తమకే ఉందంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రూట్ మార్చినట్లు స్పష్టమవుతోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాజధాని విషయంలో, మరికొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. దీనికితోడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్కు అండగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి కొంతదూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు పలు దఫాలుగా భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్సైతం ఆ మేరకు జనసేన పార్టీ శ్రేణులకు సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం, అమిత్షా, నడ్డాలతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.
టీడీపీతో కలిసి ముందుకెళ్లే విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వనప్పటికీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఏపీ జోరుగా సాగుతుంది. మరోవైపు దేశంలో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్న క్రమంలో తన పాతమిత్రులను కలుపుకొనే పనిలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీలో పాతమిత్రుడైన చంద్రబాబుతో కలిసేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నట్లు, దీంతో ఇటీవల బాబుతో అమిత్షా, జేపీ నడ్డాలు భేటీ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అమిత్షా ఫైర్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, అమిత్షా వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఏమేరకు కౌంటర్ ఇస్తారన్నది ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.
Also Read : Janasena : జనసేనకు ఝలక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర సాగుతుందా??
Related News
Narendra Modi : బెంగాల్ సిఎం ఇస్లామిక్ మతోన్మాదులకు లొంగిపోయారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'ఇస్లామిక్ మతోన్మాదులకు లొంగిపోయారని' మరియు మానవ సేవలలో నిమగ్నమైన దిగ్గజ సంస్థల సాధువులను కించపరుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు.