Stray Dogs Bill : షెల్టర్లలోకి 40 లక్షల వీధి కుక్కలు.. సంచలన ప్రతిపాదన
మన దేశంలోలాగే టర్కీలోనూ(Turkey) వీధి కుక్కల సమస్య చాలా పెరిగిపోయింది.
- Author : Pasha
Date : 13-07-2024 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
Stray Dogs Bill : మన దేశంలోలాగే టర్కీలోనూ(Turkey) వీధి కుక్కల సమస్య చాలా పెరిగిపోయింది. టర్కీలో ఇప్పుడు దాదాపు 40 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. గత 20 ఏళ్లలో దాదాపు 25 లక్షల కుక్కలకు వంధ్యత్వ శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా టర్కీ పార్లమెంటు పావులు కదుపుతోంది. ఇకపై కుక్కలను వీధుల్లో వదలకుండా.. వాటిని సురక్షితమైన షెల్టర్లలో ఉంచాలనే ప్రతిపాదనతో కూడిన ఒక బిల్లును అధికార ఏకే పార్టీ తాజాగా పార్లమెంటుకు సమర్పించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. దేశంలోని వీధి కుక్కలన్నీ(Stray Dogs Bill) పట్టి, షెల్టర్లలో బంధించనున్నారు. బిల్లు ప్రకారం.. ప్రస్తుతం టర్కీలో కుక్కలకు ఆశ్రయం కల్పించడానికి 322 జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దాదాపు లక్ష కుక్కలకు ఆశ్రయం కల్పించే వసతులు ఉన్నాయి. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు తమ వార్షిక బడ్జెట్లో కనీసం 0.3 శాతాన్ని కేటాయించగలిగితే దేశంలో ఎక్కడికక్కడ జంతు పునరావాస కేంద్రాలు, షెల్టర్ల నిర్మాణం జరిగిపోతుందని బిల్లులో ప్రతిపాదించారు. కుక్కల కోసం షెల్టర్లను నిర్మించడానికి, ఇప్పటికే ఉన్న షెల్టర్లను మెరుగుపర్చడానికి 2028 సంవత్సరం వరకు సమయం ఇవ్వాలని ఆ బిల్లులో ప్రస్తావించారు. అయితే ఈ ప్రతిపాదనలను కొన్ని విపక్ష పార్టీలు, జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. కుక్కలను షెల్టర్లలో బంధించడం కంటే.. వాటికి వంధ్యత్వ సర్జరీలు చేయడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం.. దేశంలోని మునిసిపాలిటీలు వీధి కుక్కలన్నింటికీ సకాలంలో టీకాలు వేయాలి. వాటికి చికిత్స చేసిన తర్వాత వదిలేయాలి.
Also Read :PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?
మన హైదరాబాద్లో..
హైదరాబాద్లో దాదాపు 6 లక్షల పైచిలుకు వీధి కుక్కలు ఉన్నాయి. వాటిని నియంత్రించే అంశంపై తెలంగాణ హైకోర్టు ఈనెల 10న కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే తాము వదిలిపెట్టమని తేల్చి చెప్పింది. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.