Tejas Fighter Jet Accident : దుబాయ్ ఎయిర్షోలో భారత ‘తేజస్’ యుద్ధవిమానం కూలింది; పైలట్ స్థితిపై స్పష్టత లేదు
- By Vamsi Chowdary Korata Published Date - 05:16 PM, Fri - 21 November 25
దుబాయ్ ఎయిర్షోలో భారత వాయుసేనకి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఈ ఘటన అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ వద్ద డెమో ఫ్లైట్ చేస్తున్నప్పుడు జరిగింది. వార్తా సంస్థ AP ప్రకారం, ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం దుబాయ్ సమయం 2:10 గంటలకు, భారత సమయం ప్రకారం 3:40 గంటలకు జరిగింది.
ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ ఈజెక్ట్ అయ్యారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం లేదు. విమానం నేలకు తాకగానే భారీగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత గాల్లోకి నల్ల పొగ ఎగసిపడింది.
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీ ఏర్పాటు చేసినట్టు భారత వాయుసేన ప్రకటించింది. ఇది తేజస్ యుద్ధవిమానం కూలిన రెండో ఘటన. ఇంతకుముందు 2024లో రాజస్థాన్లోని పోకరణ్లో జరిగిన యుద్ధాభ్యాసంలో ఇంజిన్ ఫెయిల్ కావడంతో తేజస్ కూలిపోయింది.
దుబాయ్ ఎయిర్షోలో ప్రపంచంలోని ప్రముఖ ఎయిరోస్పేస్ కంపెనీలు, ఎయిర్లైన్స్, ఎయిర్ ఫోర్సులు మరియు టెక్నాలజీ సంస్థలు తమ ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, ఆయుధ వ్యవస్థలు మరియు ఎయిరోస్పేస్ టెక్నాలజీని ప్రదర్శిస్తాయి. ఐదు రోజుల ఈ ఎయిర్షోలో శుక్రవారం చివరి రోజు.
1989లో ప్రారంభమైన దుబాయ్ ఎయిర్షో ప్రతి రెండేళ్లకోసారి అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిర్వహించబడుతుంది. వరుసగా మూడోసారి తేజస్ జెట్ ఈ ఎయిర్షోలో పాల్గొంది.