UN Funds Pause : హమాస్ దాడికి యూఎన్ సంస్థ సాయం ? నిధులు నిలిపేసిన మూడు దేశాలు
UN Funds Pause : ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్స్ (UNRWA)కి విరాళాలు ఇవ్వడాన్ని అమెరికా సహా పలు దేశాలు ఆపేశాయి.
- By Pasha Published Date - 09:38 AM, Sun - 28 January 24

UN Funds Pause : ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్స్ (UNRWA)కి విరాళాలు ఇవ్వడాన్ని అమెరికా సహా పలు దేశాలు ఆపేశాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో UNRWA ఉద్యోగుల పాత్ర కూడా ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆరోపణలు చేశారు. దీనిపై అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సమాచారాన్ని అందించారు. దీంతో పాలస్తీనా ప్రజలకు సహాయ సహకారాలను అందించే UNRWA సంస్థకు సమకూర్చే విరాళాలను ఆ మూడు దేశాలు(UN Funds Pause) ఆపేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన దాడిలో UNRWAకు చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించింది. దీనిపై స్పందించిన UNRWA కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది ఉద్యోగులను తొలగించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఇక యుద్ధం తర్వాత గాజాలో UNRWA సహాయ కార్యకలాపాలను ఆపేయాలని ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి పెంచుతామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ తెలిపారు. అవసరమైతే అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతు తీసుకుంటామన్నారు.
హమాస్ స్పందన ఇదీ..
ఈ పరిణామంపై స్పందించిన హమాస్ .. ‘‘ పాలస్తీనియన్ల సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థలను భయపెట్టాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది’’ అని విమర్శించింది. ఐరాస అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే ఇజ్రాయెల్తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని హమాస్ ఇటీవల ప్రకటించింది. అయితే, ఇజ్రాయెల్ సైతం దాన్ని అమలు చేయాలని షరతు విధించింది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న బందీలనూ విడిచిపెడతామని చెప్పింది. గాజా స్ట్రిప్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దిగ్బంధనానికి ముగింపు పలకాలని కోరింది. ఈ భూభాగంలోకి మానవతా సహాయం, పునర్నిర్మాణ సామగ్రిని అనుమతించాలని విన్నవించింది.
Also Read :Supreme Court – 75 : 75వ వసంతంలోకి సుప్రీంకోర్టు.. చారిత్రక విశేషాలివీ
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి ఘటనలో 1200 మంది మరణించారు. 250 మంది ఇజ్రాయెలీలను హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఇజ్రాయెల్ బలగాలు హమాస్ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26,083 మంది గాజా ప్రజలు చనిపోయారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.