Nitish Kumar: కాసేపట్లో సీఎం నితీశ్ రాజీనామా.. సాయంత్రం మరోసారి సీఎంగా ప్రమాణం !
Nitish Kumar: బిహార్లో ఇవాళ బీజేపీతో కలిసి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
- By Pasha Published Date - 08:32 AM, Sun - 28 January 24
Nitish Kumar: బిహార్లో ఇవాళ బీజేపీతో కలిసి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాకూటమికి గుడ్బై చెప్పనున్నారు. ఈక్రమంలోనే ఓ కీలక పరిణామం జరిగింది. తన రాజీనామా లేఖను అందించడానికి సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అపాయింట్మెంట్ కోరారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. అది ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్భవన్కు బయలుదేరి వెళ్తారు. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించి.. సాయంత్రం 4 గంటలలోగా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, బీజేపీ మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు నితీశ్ అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేస్తారని సమాచారం. బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులతో పాటు ఒకరికి స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు నితీశ్ అంగీకరించారని తెలుస్తోంది. ఆర్జేడీ మంత్రుల పోస్టులన్నీ బీజేపీ నేతలకు నితీశ్(Nitish Kumar) కేటాయించనున్నారట.
We’re now on WhatsApp. Click to Join.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్ను అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం మీదుగా వెళుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర బాధ్యతలను ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.
Also Read :Iran Vs Pakistan: ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్.. 9 మంది పాకిస్తానీయుల కాల్చివేత
నితీశ్ జంపింగ్ ఇది ఐదోసారి..
- 17 ఏళ్ల పాటు(2013 సంవత్సరం వరకు) నితీశ్ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారు. అయితే 2013లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించాక.. ఆయన ఎన్డీఏకు కటీఫ్ చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి పీఎం అయ్యే ఛాన్స్ వస్తుందని ఆశించి భంగపడటంతో అప్పట్లో అలా నితీశ్ జంప్ అయ్యారు.
- 2015 సంవత్సరంలో నితీశ్కు చెందిన జేడీయూ.. కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అప్పట్లో కూడా బిహార్లోని 243 అసెంబ్లీ సీట్లలో 80 లాలూ పార్టీ ఆర్జేడీ గెల్చుకుంది. అయినా సీఎం అయింది నితీశే. ఆ తర్వాత రెండేళ్లకే (2017లో) ఆయన జంప్ అయ్యారు. కూటమిలోని ఆర్జేడీ అవినీతికి పాల్పడుతోందనే ఆరోపణ చేసిన నితీశ్.. సింపుల్గా బైబై చెప్పి ఎన్డీఏలోకి వెళ్లిపోయారు.
- 2017 సంవత్సరంలో ఎన్డీఏ గూటిలో చేరిన నితీశ్.. మోడీ హవా ఫలితంగా 2019 బిహార్ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 75 సీట్లలో గెలుపుతూ బిహార్లో అతిపెద్ద పార్టీగా లాలూ పార్టీ ఆర్జేడీ అవతరించింది. అయినా బీజేపీతో కలిసి నితీశ్ సర్కారును ఏర్పాటుచేసి సీఎం అయ్యారు.
- 2020 నుంచి 2022 సంవత్సరం వరకు బీహార్లో సాఫీగానే నడిచిన ఎన్డీఏ సర్కారు చివరకు నితీశ్ జంపింగ్ కారణంగా కూలిపోయింది. 2022 సంవత్సరంలో నితీశ్ కుమార్ తన వైఖరిని మార్చుకొని ఆర్జేడీ పంచన చేరారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, జేడీయూ ఎమ్మెల్యేలను తనపై తిరుగుబాటుకు ఉసిగొల్పుతోందని ఆ సందర్భంగా నితీశ్ ఆరోపించారు.
- తాజాగా ఇప్పుడు మరోసారి(ఐదో దఫా) కూడా నితీశ్ ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి బిహార్లో 2022 సంవత్సరంలో ఏర్పాటుచేసిన మహా ఘట్బంధన్ కూటమికి గుడ్ బై చెప్పి.. ఎన్డీఏకు జై కొట్టి అందరినీ ఆయన ఆశ్చర్యపరిచారు.
Related News
NDA Bihar : బిహార్లో ‘పొత్తు’ పొడిచింది.. బీజేపీకి 17, జేడీయూకు 16
NDA Bihar : ఎన్నికల సమరం కోసం అశోకుడి జన్మభూమి బిహార్ రెడీ అవుతోంది.