Medals In Ganga : గంగలో మెడల్స్..నిమజ్జనానికి బయలుదేరిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. వివిధ పోటీలు, టోర్నమెంట్స్ లో దేశం కోసం తాము గెలిచిన మెడల్స్.. ప్రభుత్వం తమకు ఇచ్చిన మెడల్స్ ను గంగా నదిలో(Medals In Ganga) నిమజ్జనం చేస్తామని వెల్లడించారు.
- Author : Pasha
Date : 30-05-2023 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
లేఖలో ఏముంది ?
“ మా మెడలో వేసిన ఈ పతకాలకు ఇక అర్థం లేదని అనిపిస్తోంది. దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వ వ్యవస్థ ప్రచారం కోసం మాత్రమే ఆ మెడల్స్ మాకు ఇచ్చారని అనిపిస్తోంది. అటువంటి పతకాలు అక్కర్లేదు. ఇప్పుడు మేం మా ఆత్మగౌరవంతో రాజీపడి జీవించడం వల్ల ఉపయోగం ఏమిటి ? ప్రస్తుతం మన దేశానికి రాష్ట్రపతిగా ఒక మహిళ ఉన్నారు. మేం నిరసన తెలిపిన ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఆమె కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కూర్చొని అంతా చూస్తున్నారు. కానీ ఏమీ మాట్లాడటం లేదు. ఇంతగా మేం గొంతు చించుకుంటున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్ల చొక్కా వేసుకొని టిప్ టాప్ గా తిరుగుతున్నా ఎవరూ అతడి అక్రమాల గురించి మాట్లాడటం లేదు. మేం ప్రజాస్వామ్య బద్ధంగా కొత్త పార్లమెంట్ దగ్గరికి వెళ్లి నిరసన తెలిపేందుకు బయలుదేరితే .. మాపై దాడి చేసి జైలులో పెట్టారు.. అందుకే ఆ మెడల్స్ ను వాళ్లకు తిరిగి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. మేం హరిద్వార్ కు వెళ్లి వాటిని గంగలో(Medals In Ganga) కలుపుతాం ” అని నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ లేఖలో పేర్కొన్నారు.