KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 01:26 PM, Sat - 26 October 24

Cotton purchases : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో పత్తి కొనుగోళ్ల తీరుపై ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతోందని ఆయన అన్నారు. బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు. రైతు డిక్లరేషన్ బోగస్.. కర్షక ద్రోహి కాంగ్రెస్ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్విటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి, ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కాంగ్రెస్ సర్కారు కూర్చున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంటైన పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు, శ్రద్ధలేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదని విమర్శించారు. ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని, సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని దుయ్యబట్టారు.