Tremors In India : ఇండియాలో భూప్రకంపనలు.. పాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంపం
భూకంపం వణికించింది. ఇండియాలో భూ ప్రకంపనలు (Tremors In India) చోటుచేసుకున్నాయి.
- Author : Pasha
Date : 28-05-2023 - 12:42 IST
Published By : Hashtagu Telugu Desk
భూకంపం వణికించింది. ఇండియాలో భూ ప్రకంపనలు (Tremors In India) చోటుచేసుకున్నాయి. ఇవాళ (ఆదివారం) ఉదయం 10.19 గంటలకు ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు తూర్పు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈవిషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ధృవీకరించింది. ఇక ఈ భూకంపం ఎఫెక్ట్.. పొరుగునే ఉన్న మన ఇండియా పై కూడా పడింది. కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్, పూంచ్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలు, పంజాబ్, హర్యానా బార్డర్ ఏరియాలలో పలుచోట్ల జనం భూ ప్రకంపనలు(Tremors In India) ఫీల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్లోనూ భారీ భూకంపం..
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్ సహా వివిధ పట్టణ ప్రాంతాలలో 6.3 తీవ్రతతో ఆదివారం ఉదయం భూకంపం నమోదైందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇస్లామాబాద్లోని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ ప్రకారం.. ఈ భూకంపం యొక్క కేంద్రం ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ మధ్య ఉన్న బార్డర్ ఏరియాలో 223 కిలోమీటర్ల లోతులో ఉంది. దీనివల్ల పాక్ లోని ఇస్లామాబాద్, పెషావర్, స్మాక్, హరిపూర్, మలాకంద్, అబోటాబాద్, బాత్గ్రామ్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కొన్ని విభిన్న భాగాలలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సమాచారం బయటికి లేదు. 2005లో పాకిస్థాన్లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంలో 74,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.