Soul In Hospital : ఆత్మ కోసం ఆస్పత్రిలో పూజలు.. ఏం చేశారంటే ?
Soul In Hospital : ఏడాది క్రితం ఓ యువకుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు.
- Author : Pasha
Date : 24-11-2023 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
Soul In Hospital : ఏడాది క్రితం ఓ యువకుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు అతడి ఆత్మ కోసం కుటుంబానికి చెందిన 24 మంది డప్పులు, ఆరతి పళ్లాలతో మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్ప్రతిలోకి వెళ్లి డ్రమ్ములు వాయించారు. ప్లేట్లు వాయించారు. కత్తులు ఊపారు. మద్యం తాగారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు ఇబ్బంది కలుగుతుందని కూడా వారు ఆలోచించలేదు. దాదాపు గంటపాటు ఆ 24 మంది.. తమవాడి ఆత్మ కోసం నానా మూఢనమ్మకాలతో హాస్పిటల్లో యాక్షన్ డ్రామాను కొనసాగించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆస్పత్రి సీఎంహెచ్ఓ అందుబాటులో లేరు. దీంతో ఆ 24 మందిని ఆస్పత్రిలోకి అనుమతించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్ ప్రకటించారు. వారిని ఆస్పత్రిలోకి అనుమతించడం తప్పేనని ఒప్పుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రత్లాం జిల్లాలో ఈ తరహా మూఢనమ్మకాల ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2020 సంవత్సరంలో మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో శివగఢ్ గ్రామానికి చెందిన మోహన్ పాట్లీ (18) అనే వ్యక్తి చికిత్సపొందుతూ చనిపోయాడు. అయితే 2022 డిసెంబరులో అతడి కుటుంబీకులు ఆ ఆస్పత్రికి వచ్చి.. తమ వాడి ఆత్మను సొంతూరికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక పూజలు చేశారు. అగరబత్తీలు, బుట్ట, ఒక రాయి సహా కొన్ని వస్తువులతో వాళ్లు ఆనాడు హల్చల్ చేశారు. ఒక రాయిని ఆస్పత్రిలో పెట్టి పూజిస్తామని, అందులోకి అతడు చేరగానే తీసుకెళ్లి పోతామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే వారి నమ్మకాన్ని గౌరవించేందుకుగానూ పూజలు చేసుకునేందుకు చనిపోయిన రోగి కుటుంబాన్ని(Soul In Hospital) అనుమతించారు.