YS Sharmila: షర్మిల రాజకీయ కథ కంచికే.!?
ఇటలీ వనిత సోనియాగాంధీని కోడలిగా భారత దేశం ఆదరించింది. కానీ, వైఎస్ షర్మిలను మాత్రం కోడలిగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు అంగీకరించడంలేదు.
- By CS Rao Published Date - 03:00 PM, Fri - 31 December 21
ఇటలీ వనిత సోనియాగాంధీని కోడలిగా భారత దేశం ఆదరించింది. కానీ, వైఎస్ షర్మిలను మాత్రం కోడలిగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు అంగీకరించడంలేదు. కులం, ప్రాంతం, మతం రంగు రాజకీయాలకు ఎక్కువే. మెట్టినింట ఉన్న షర్మిలను తెలంగాణ సమాజం ఆదరిస్తుందా? లేదా? అనేదాక వెళ్లకుండానే ప్రత్యర్థి పార్టీలు వెనక్కు నెట్టేశాయి. చీర, సారె కావాలంటే తీసుకెళ్లు గానీ తెలంగాణకు రావద్దంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. షర్మిల తెలంగాణ ఆడబిడ్డ కాదంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ లోని కొందరు లీడర్లు టార్గెట్ చేశారు. ఏపీలోని జగన్ పాలన చూసుకోమని కొందరు ఉచిత సలహాలను కూడా పడేశారు. ఏ మాత్రం మొక్కోవోని ధైర్యంతో తెలంగాణ సమాజం కోసం ఆమె పోరాడుతోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని వైఫల్యాలు పరోక్షంగా షర్మిలను వెంటాడుతున్నాయి. అక్కడ ఆయన ఏమి చేశాడో..చూస్తున్నారుగా..ఇక తెలంగాణలో అవకాశం ఇస్తే, ఈమె కూడా అలాగే చేస్తుందని విమర్శించే వాళ్లు ఎక్కువ అయ్యారు. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ అభివృద్ధిని జగన్ కాలరాశాడని వస్తోన్న ఆరోపణలు షర్మిలను వెంటాడుతున్నాయి. పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఆమె తొలి అడుగులు బాగానే పడ్డాయి. ఆ తరువాత వేసిన అడుగులు కలిసి రాలేదు. ఫలితంగా షర్మిల ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? ఎందుకు పార్టీ పెట్టారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా మద్ధతు లేకుండా రాజకీయాలు నడిపే పరిస్థితి లేదు. సాక్షి మీడియా లేకపోతే జగన్ మనుగడే ఉండేది కాదని మేధావులు భావిస్తుంటారు. వాళ్ల భావనకు బలం చేకూరేలా తెలంగాణలో షర్మిల పరిస్థితి ఉంది. ఆమె చేసిన మంగళవారం ఉద్యోగ దీక్షలు, రైతు కుటుంబాల పరామర్శ, నిరుద్యోగ ర్యాలీలు..ఇవన్నీ మీడియాలో హైలెట్ కాలేదు. సాహసోపేతంగా ప్రారంభించిన పాదయాత్ర కు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత శూన్యం. సొంత మీడియా సాక్షి కూడా ఆమె పాదయాత్రకు కవరేజ్ ఇవ్వలేదు.
దివంగత వైఎస్ ఆర్ ప్రారంభించిన చేవెళ్ల వద్ద డిసెంబర్ 20న వైఎస్ షర్మిల 40వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏకబిగిన యాత్రను పూర్తి చేసేలా బ్లూప్రింట్ ను తయారు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 90 నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందింది.
గత ఏడేళ్లలో 7,000 మంది రైతులకు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలను మించిన ఆత్మహత్యలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అక్టోబర్ 20న పాదయాత్రను ప్రారంభించారు. 400 రోజుల్లో 4,000 కి.మీలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో దళితులపై దాడులు 800 శాతం పెరిగాయని, మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగాయని, మహిళలపై దాడులు కూడా పెరిగాయని షర్మిల లెక్కించింది. వీటన్నింటినీ ప్రజల మధ్యకు వెళ్లాలని ప్రయత్నం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉటంకిస్తూ నవంబర్ 10న బ్రేకులు వేయడానికి ముందు 21 రోజుల పాటు యాత్ర చేసింది. చేవెళ్ల, మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, మునుగోడు వంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. రైతుల సమస్యలపై ఇందిరాపార్కు వద్ద 72 గంటల దీక్ష చేసేందుకు ఆమె ప్రయత్నించగా, ఒక్కరోజు మాత్రమే అనుమతి లభించింది. అప్పుడు కూడా ఆమెకు జనం, మీడియా నుంచి పెద్దగా స్పందన రాలేదు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసిన తర్వాత డిసెంబర్ 16 తరువాత తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆనాడు చెప్పారు. కానీ ఆ దిశగా ఆమె కదలికలు ఇప్పుడు లేవని తెలుస్తోంది. ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఒక కారణంకాగా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంట్రాక్టును ఉపసంహరించుకున్నారు. దీంతో ఆమె పాదయాత్ర ఇక ఉండదని లోటస్ పాండ్ వర్గాల టాక్. పాదయాత్ర తొలి వారంలో జగన్ కు అత్యంత సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి ఆమెను కలిశాడు. ఆ తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కలిసి వెళ్లాడు. వాళ్ల ద్వారా ఏసీ సీఎం జగన్ దో సందేశం షర్మిలకు పంపాడని ఆనాడు చర్చ జరిగింది. వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 21 రోజుల పాటు ఆమె యాత్ర చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలోని తప్పులు, మీడియా మద్ధతు లేకపోవడం, జగన్ నుంచి సానుకూలత లభించకపోవడం, కుటుంబ వ్యవహారం ..తదితరాలు ఆమెకు బ్రేక్ లు వేశాయని అనుచరుల టాక్. క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయ వేదికగా అన్నా , చెల్లిలు మధ్య తారాస్థాయిలో వివాదం జరిగిందని చర్చ జరుగుతోంది. ఇలాంటి అడ్డుంకులను దాటుకుని మళ్లీ షర్మిల పాదయాత్ర చేస్తుందా? అనే అనుమానం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సో…షర్మిల్ రాజకీయ కథ కంచికేనన్నమాట.
Related News
Cheetah Dies : నారాయణపేట జిల్లాలో ఎండదెబ్బకు చిరుత మృతి
ఈ ఎండలకు కేవలం మనుషులే కాదు అడవిలో ఉన్న జంతువులు సైతం మృతువాత పడుతున్నాయి. తాజాగా జాదవరావుపల్లిలో వడదెబ్బతో చిరుత మృతి చెందింది