Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
- Author : Prasad
Date : 26-05-2026 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్లో కలిశారు. భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు, రాయగిరి భూసేకరణ, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యలపై నివేదిక తెప్పించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కవిత పేర్కొన్నారు. గవర్నర్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భూ నిర్వాసితులు, బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వంద రూపాయల చీర ఇచ్చి వాళ్లను కోటీశ్వరులను చేశామంటూ సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు అంశాలపై కూడా ఆమె స్పందిస్తూ వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.