KTR: నిన్న నల్లచట్టాలు.. నేడు నల్లబంగారం!
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
- By Balu J Published Date - 02:25 PM, Mon - 7 February 22
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6 , శ్రవనపల్లీ ఒసి, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించి.. ఆ మేరకు ముందుకు పోవడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఈ మేరకు ఒక ఘాటైన లేఖ రాశారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 7 ఏళ్ళ కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పిఎల్ఎఫ్ ను కలిగి ఉందన్నారు. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదన్నారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానం లో దూసుకెళ్తున్నదని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఎకైక సంస్ధ సింగరేణి అని కేటీఆర్ గుర్తు చేశారు. కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్ధ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, సింగరేణి కార్మిక బిడ్డల కృషితో ఇంతకాలం కార్మికులకు లాభాల్లో వాటాలు అనేది పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయని, సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి నష్టాల మూటలు అనేవి ప్రధాన శీర్షికలు అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు. పక్క రాష్ట్రం అంద్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్ధను చంపే కుట్రకు తెరలెపిందని కెటియార్ అన్నారు. మరోవైపు గుజరాత్ రాష్ర్టంలో మాత్రం అడిగిన వేంటనే లిగ్నైట్ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ సంస్ధకు కేటాయించినట్టు, తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బిజెపి పాలనలో గుజరాత్ కో విధానం, తెలంగాణకొక విధానం ఉందన్నారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ర్టం కాదా ప్రశ్నించారు. ఇదీ కేవలం సింగరేణి సంస్ధపై మాత్రమే వివక్ష కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంపై వివక్ష అన్నారు. కేంద్రం కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ కుట్రలను అపకుంటే తగిన బుద్ది చెబుతారన్నారు.
సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దండయాత్రగా మంత్రి అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడవడమేనని, రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతంత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ యువతకు ఉద్యోగాల గని, సింగరేణి అని స్పష్టంచేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో విరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని హెచ్చరించారు.
Related News
Nara Lokesh: ఏపీ సంక్షేమం కోసమే ప్రజాగళం కూటమి ఏర్పాటు
Nara Lokesh ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో కూటమి ఆధ్వర్యాన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి యువనేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తిరుపతి అంటే అమర్ రాజా, అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్ ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20వేల మంది ఉద్యోగాలు కో�