KTR: తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, రాహుల్ పై కేటీఆర్ ఫైర్
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు.
- By Balu J Published Date - 11:49 AM, Thu - 19 October 23

KTR: రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు, పార్టీలపై తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టింది. అయితే, బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ స్పందించి కాంగ్రెస్కు పొలిటికల్ కౌంటరిచ్చారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని, సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘ విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు.. కరప్షన్కు కేరాఫ్… కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాఖ్యలా ?? అని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు.. 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించిన నాడే..తెలంగాణ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబంధు రేవంత్. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది..?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.