Telangana Thalli Statue: ముదురుతున్న తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.. హైకోర్టులో పిల్!
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.
- Author : Gopichand
Date : 07-12-2024 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Thalli Statue: నూతన తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) ఏర్పాటుపై తెలంగాణలో వివాదం మొదలైంది. ఈ విగ్రహంపై మేధావులు గళం విపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ నా కోటి రథనాల వీణ అని మహాకవి దాశరధి అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన, సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.
Also Read: Travis Head: సెంచరీతో హెడ్ విధ్వంసం.. డే-నైట్ టెస్టులో ఫాస్టెస్ సెంచరీ ఇదే!
తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలివే!
తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా ఉంది. విగ్రహం ప్రత్యేకతల గురించి చెప్పకుంటే తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. మెడలో తెలంగాణ తీగ, చేతికి ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్నట్లు విగ్రహంలో కనిపిస్తుంది. పోరాట స్పూర్తిని తెలిపేలా బిగించిన పిడికిలి.. అభయహస్తంతో ప్రజలకు ఆశీస్సులు ఇస్తున్నట్లుగా విగ్రహాన్ని సీఎం రేవంత్ సర్కార్ తయారుచేయించింది.
మరోవైపు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు రావాలని ఇప్పటికే మంత్రి పొన్నం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే.