Funeral Charges Increase : మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర 1వ వేతన సవరణ సంఘం ప్రకారం.. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు.
- By Latha Suma Published Date - 04:54 PM, Mon - 2 December 24

Funeral Charges Increase : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలు పెంచింది. ఇప్పటివరకు అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలు ఉండగా.. దానిని రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు అంత్యక్రియల ఛార్జీలను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు రిక్వెస్ట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర 1వ వేతన సవరణ సంఘం ప్రకారం.. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు.
ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. మరణానంతరం జరిగే ఖర్చులను భరించేందుకు రూ.30 వేలకు పెంచింది. పెంచిన మొత్తం సంబంధిత డిపార్ట్మెంట్ మేజర్, మైనర్, సబ్-హెడ్ ఆఫ్ అకౌంట్ కింద “310-గ్రాంట్స్-ఇన్-ఎయిడ్”, “318-ఆబ్సెక్వీస్ ఛార్జీలు” సబ్ డిటైల్డ్ హెడ్ ఆఫ్ అకౌంట్కు డెబిట్ అవుతాయి. ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియంత్రణ ఉత్తర్వుల నుంచి మినహాయించారు. సెక్రటేరియట్లోని అన్ని డిపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్ హెడ్లు అదే ఆర్థిక సంవత్సరంలో తగిన సమయంలో వెచ్చించిన ఖర్చులకు అనుబంధ గ్రాంట్ను పొందాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మరణాంతరం కుటుంబాలపై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది.
కాగా, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కూడా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా మరణాంతరం ఆర్థిక సాయం ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడుతోంది.
Read Also: Sobhita – Samantha : శోభిత ధూళిపాళ లైఫ్ లో సమంత ఎవరో తెలుసా?