TS Cabinet Expansion : ముందస్తు..మంత్రివర్గ విస్తరణ.!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తాడో..దగ్గర వాళ్లకు కూడా అంతుబట్టదు.
- By CS Rao Published Date - 04:13 PM, Sat - 19 March 22
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తాడో..దగ్గర వాళ్లకు కూడా అంతుబట్టదు. మీడియాను ఒక కోణంలోకి తీసుకెళ్లి మరో కోణంలో చతురతను ప్రదర్శిస్తాడు. అత్యవరసంగా ఫామ్ హౌస్ లో శనివారం అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ , కీలక అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశాడు. ముందస్తుకు ప్లాన్ చేస్తున్నాడని మీడియా కోడై కూస్తోంది. కానీ, విశ్వసనీయంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం క్యాబినెట్ విస్తరణకు వెళుతున్నాడని తెలుస్తోంది.వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కేసీఆర్ సర్కార్ కు గడువు ఉంది. ఇప్పుడే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన సాహసం చేయకపోవచ్చు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కంటే కూడా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలతో పాటు వెళితే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాడని ఆయన సన్నిహితులు కొందరు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రుల అత్యవసర సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
ఎమ్మెల్సీల ఎన్నికల వ్యవహారం కూడా ముగిసింది. పైగా ఈటెల రాజేంద్ర ఇటీవల హుజరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలోని కొందరు మంత్రులపై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి. పైగా సామాజిక ఈక్వేషన్ ప్రకారం ఇంకా బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. కుమార్తె కవితకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చాలా కాలంగా అనుకుంటున్నప్పటికీ పెండింగ్ లో ఉంది. ఇవన్నీ మంత్రివర్గ విస్తరణ దిశగా కేసీఆర్ వెళుతున్నాడనడానికి ఆధారాలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ , సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. అసలు వీరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు ఊహించలేదు. ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఏదో ఉంటుంది. ఈటెల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్ను మంత్రిని చేయాలనే ఉద్దేశ్యం సీఎం కేసీఆర్ కు ఉందని కొందరు ఊహిస్తున్నారు. బీసీ జనాభాలో సింహభాగంగా ఉండే ముదిరాజ్ల మద్దతు కోసం ఆ విధంగా ప్లాన్ చేశాడని టాక్.ఇక సిద్ధిపేట జిల్లా కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి చేసిన సేవలకు ప్రతిఫలంగా మంత్రి పదవిని ఇస్తారని వినికిడి. నగరానికి చెందిన ఓ మంత్రి అదే సామాజిక వర్గం నుంచి కొనసాగుతున్నాడు. ఆయన్ను తప్పించడం ద్వారా వెంకటరామిరెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లోని చర్చ. ఇప్పుడున్న కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీష్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు.
ఈటల ఉద్వాసన వల్ల ప్రాతినిథ్యాన్ని కోల్పోయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి బండా ప్రకాష్తో భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనే హామీతోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లోకి వెళ్లాడు. మంత్రి పదవి ఇస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కూడా కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు కావడం, తెలంగాణ రాజకీయాలపై సమగ్రమైన పట్టు ఉండటం, కేసీఆర్తో సమకాలీకుడు కావడం వంటి అంశాలన్నీ కడియం శ్రీహరికి కలిసి వచ్చేవేనని చెబుతున్నారు. ఇలా అన్ని రకాల ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకుని.. కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పునర్వవస్థీకరిస్తాడని తెలుస్తోంది. 2023లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేలా సీనియర్, జూనియర్ల తో కలిసి ఉండే కేబినెట్ కూర్పు ఉంటుందని టాక్.
వాస్తవంగా ఫిబ్రవరిలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గులాబీ శ్రేణులు అనుకున్నాయి. కానీ, ముహూర్తాలు చూసుకునే కేసీఆర్ యాదాద్రి ప్రారంభానికి ముందే మంత్రివర్గాన్ని విస్తరింప చేసి సుదర్శన యాగాన్ని, ఇతర హోమాలను పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.ముందస్తు ఎన్నికల కంటే మంత్రివర్గం విస్తరణ కోసం అత్యవసర సమావేశాన్ని మంత్రులతో ఏర్పాటు చేసుకున్నాడని టాక్. సో..కవిత కు మంత్రి కాబోతుందన్నమాట.
Related News
Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్సభ’ పరీక్ష.. ఎందుకంటే ?
Telangana Ministers : ఈ లోక్సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాదు.. తెలంగాణ మంత్రులకు కూడా ఒక పరీక్షలా మారాయి.