TG Cabinet Meeting : కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం..ప్రధాన చర్చ వీటిపైనే !!
TG Cabinet Meeting : ఇక నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు
- By Sudheer Published Date - 10:29 AM, Thu - 10 July 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధత వంటి రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాల్సిన అవసరం ఉండటంతో ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే పంచాయతీరాజ్ చట్ట సవరణను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. అయితే ఇది 50% రిజర్వేషన్ పరిమితిని దాటి వెళుతుండటంతో, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది.
Shivling Puja: గర్భధారణ సమయంలో శివుడ్ని పూజించడటం వల్ల లాభాలు ఉన్నాయా?
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భేటీలో వర్షాలు, వరదలు, విపత్తులను ఎదుర్కొనే విధానంపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో తగిన అప్రమత్తత, సహాయక చర్యల ప్రణాళికలు, విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్పై మంత్రులు చర్చించనున్నారు. సహాయక బృందాల సన్నద్ధత, అవసరమైన నిధుల విడుదల వంటి అంశాలపై స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్షాకాలం లో వ్యవస్థలు అప్రతిబంధంగా పనిచేయాల్సిన అవసరం ఉండటంతో సంబంధిత శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశముంది.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, రుణాల మంజూరు, రుణమాఫీ వంటి వ్యవసాయ అంశాలపై కూడా మంత్రివర్గం లో చర్చ జరుగుతుంది. ఇటీవల వర్షాలు ప్రారంభమవడంతో సాగు సీజన్ సక్రమంగా సాగేందుకు అవసరమైన మద్దతును ప్రభుత్వం ఇవ్వాలన్న దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, మేడిగడ్డ బ్యారేజి నుంచి నీటి విడుదల, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశముంది. సాగునీటి అందుబాటుపై రైతుల్లో ఉన్న ఆశలు, రాజకీయ పార్టీల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాలను సీఎం రేవంత్ ప్రాధాన్యతగా తీసుకుంటారని అంచనా.
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
ఇక నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే రేషన్ కార్డుల పంపిణీపై సమగ్ర సమీక్ష చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య కళాశాలల నిర్మాణం, పాఠశాలల నిర్వహణ వంటి అంశాలు కూడా చర్చకు రావొచ్చు. ముఖ్యంగా మహిళలకు భూముల రిజిస్ట్రేషన్పై సవరించిన స్టాంప్ డ్యూటీ, రాజీవ్ యువవికాసం వంటి నూతన పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం సీఎం నిర్ణయించిన ‘ప్రతీ నెలా రెండు క్యాబినెట్ భేటీలు’ విధానంలో భాగంగా జరుగుతుంది.