Teegala Krishna Reddy : బీఆర్ఎస్కు షాక్.. తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా
Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది.
- By Pasha Published Date - 06:42 PM, Sun - 25 February 24

Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి ‘చెయ్యె’త్తి జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలోకి చేరిపోయారు. తాజాగా బీఆర్ఎస్కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక సమక్షంలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో తీగల ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరికకు ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) లైన్ క్లియర్ చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్లో జాయినింగ్కు రంగం సిద్ధం చేసుకున్నారు.
తీగల కృష్ణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆయన 1984 నుంచి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మేయర్ గా, హుడా ఛైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా విజయం సాధించి.. టీఆర్ఎస్ పార్టీలో తీగల కృష్ణారెడ్డి చేరారు. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ ట్రేడర్స్ సెల్ అధ్యక్ష పదవికి కూడా శోభన్రెడ్డి రాజీనామా చేశారు.