Telangana Pending Bills: పెండింగ్ బిల్లులపై సుప్రీంకు వివరణ ఇచ్చిన గవర్నర్
తెలంగాణ శాసనసభ ఆమోదించిన పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకు వివరణ ఇచ్చారు ప్రభుత్వ న్యాయవాది
- Author : Praveen Aluthuru
Date : 11-04-2023 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Pending Bills: తెలంగాణ శాసనసభ ఆమోదించిన పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకు వివరణ ఇచ్చారు ప్రభుత్వ న్యాయవాది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిందని, మరో రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయ స్థానానికి వివరించారు.
గవర్నర్ ఆమోదించిన బిల్లులలో తెలంగాణ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపాలిటీల (సవరణ) బిల్లు 2023, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీతో కూడిన బిల్లులు ఉన్నాయి. కాగా రాష్ట్రపతి పరిశీలనకు పంపించిన బిల్లులలో ది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు 2022 మరియు తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు 2022. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు 2022 మరియు తెలంగాణ ( Telangana ) పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణ పంచాయితీ రాజ్ (సవరణ) బిల్లు 2023కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ వివరణ కోరినట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా.. ఆమోదం తెలపాల్సిన బిల్లులు ఎప్పటిలోపు క్లియర్ చేస్తారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించగా.. గవర్నర్ కార్యాలయంతో చర్చించి చెప్తామని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. అయితే ఈ కేసు విచారణను వారం రోజులపాటు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తిని మన్నించి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. అయితే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా సవరణ బిల్లు-2022ను న్యాయశాఖ ఇప్పటివరకు గవర్నర్కి సమర్పించలేదని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసు విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు.
Also Read: Telangana Gurukuls: తెలంగాణ గురుకులాలు దేశానికే తలమానికం