Telangana Election Results : కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ కీలక ఆదేశాలు
రాహుల్ గాంధీ అభ్యర్థులెవరిని హైదరాబాద్ కు పిలవొద్దని సూచించినట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 02-12-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Election Results) వెల్లడి కాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ (Rahul) కీలక ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహగానాల మధ్య కాంగ్రెస్ హై కమాండ్ అప్రమత్తం అయింది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ వర్చువల్ సమావేశం జరిపారు. ఈ సందర్బంగా పలు ఆదేశాలు జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు రాహుల్ గాంధీ సూచించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వైఖరిపై రాహుల్ గాంధీ అభ్యర్థులు, నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులతో పాటు ఏఐసీసీ కేటాయించిన పరిశీలకులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని దిశానిర్దేశం చేసారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడైనా సమస్యలు ఉంటే స్పందించడానికి పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ టచ్ లోకి తీసుకుంటున్నారన్న సమాచారంతో అభ్యర్థులంతా హైదరాబాద్ కు రావాలని పీసీసీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం అభ్యర్థులెవరిని హైదరాబాద్ కు పిలవొద్దని సూచించినట్లు తెలుస్తోంది. అలా పిలవడం అంటే వారిపై అనుమానించినట్లే అవుతుందని దాని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అందువల్ల వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటె ఈరోజు రాత్రి 11:30 గంటలకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రికి బస చేయనున్నారు. తాజ్ కృష్ణా నుంచి కౌంటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించనున్నారు.
Read Also : Salaar : ట్రైలర్ తోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన సలార్ …