PM Modi : ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ.. ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ?
PM Modi : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ జరగబోతోంది.
- Author : Pasha
Date : 11-11-2023 - 7:13 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ జరగబోతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగబోతున్న ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.45లోగా ప్రధాని ప్రసంగం ఉంటుంది. 5.55 గంటలకు తిరిగి ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని ఢిల్లీకి బయలుదేరతారు.
We’re now on WhatsApp. Click to Join.
నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతోనే ముగిసింది. ఈనేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ సభతో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకించి ఇవాళ జరిగే సభలో దళిత ఓటర్లపై ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగలు దాదాపు 60 శాతం మంది ఉన్నారు. వీరు దాదాపు 25 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరని బీజేపీ భావిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎంఆర్పీఎస్ సభకు ప్రధాని మోడీ హాజరవుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసి దళిత ఓటర్ల మనసు గెలుచుకోవాలనే వ్యూహంతో కమలదళం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ఏం జరిగింది ?
సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్న టైంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లును ఆమోదించారు. కానీ సుప్రీంకోర్టులో తీర్పు వేరుగా వచ్చింది. పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యుల బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీలోనూ ఇలాగే బిల్లును ఆమోదించారు. అప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో.. రాష్ట్రాలు కులగణనను బట్టి వర్గీకరణ చేపట్టొచ్చని తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు అనుకూల తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా.. వాటిని కేంద్రం(PM Modi) పట్టించుకోలేదు.