Plenary promise: కలియుగ భారతీయుడు
జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను తయారు చేసే పనిలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొంత కాలంగా ఆయన చెబుతోన్న నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల సద్వినియోగం తదితర అంశాలపై ఒక ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తోంది.
- By CS Rao Published Date - 04:34 PM, Wed - 18 May 22
జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను తయారు చేసే పనిలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొంత కాలంగా ఆయన చెబుతోన్న నీళ్లు, నిధులు, నియామకాలు, వనరుల సద్వినియోగం తదితర అంశాలపై ఒక ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తోంది. ఆ టీమ్ ఇచ్చే ఎజెండాను ఫైనల్ చేసిన తరువాత జాతీయ ఎజెండాను ప్రకటించడంతో పాటు కొత్త పార్టీని దసరా రోజున ప్రకటిస్తారని తెలంగాణ భవన్ వర్గాల టాక్.
సోమవారం ఎర్రవల్లి ఫాంహౌస్ నుండి ప్రగతి భవన్కు తిరిగి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా చర్చలు ప్రారంభించారు. నీటిపారుదల రంగం గురించి ప్రగతి భవన్లో సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ సయ్యద్ మసూద్ హుస్సేన్తో సవివరంగా చర్చించారు. “దేశంలోని నీటిపారుదల సామర్థ్యానికి సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రధాన నదులలో నీటి లభ్యత , ఇతర సంబంధిత అంశాలపై ఆయన చర్చించారని తెలిసింది. సిఎం కేసీఆర్ , మాజీ సిడబ్ల్యుసి ఛైర్మన్ల మధ్య పూర్తిగా వ్యక్తిగతంగా జరిగిన సమావేశం కింద పరిగణిస్తున్నారు.
దేశంలో దాదాపు 70,000 టీఎంసీల నీటి లభ్యతపై కూడా కేసీఆర్ చర్చించారు. మొత్తం 70,000 టీఎంసీల నీరు, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందని ఇటీవలి కాలంలో వివిధ సందర్భాల్లో ఆయన ప్రకటించారు. 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించినా, దేశంలో ఇంకా 30,000 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని అంచనా వేశారు. ఇందులో 10,000 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తే, దేశానికి ఇంకా 20,000 టీఎంసీల మిగులు ఉంటుంది. అయినప్పటికీ, అనేక రాష్ట్రాలు కరువు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటే మైండ్ వాళ్లు ప్రభుత్వాలను నడపడం వచ్చిన దరిద్రాలంటూ కేసీఆర్ తనదైన భాషలో మాట్లాడిన విషయం విదితమే. గతంలో నీటిపారుదల రంగంపై తెలంగాణ ఏర్పాటుకు ముందు సీడబ్ల్యూసీ మాజీ అధికారి ఆర్.విద్యాసాగర్రావుతో రావు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించేవారు. రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ (ఏఐఎస్) కార్యాలయాలు మరియు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో పరిపాలన, ఆర్థిక విషయాలపై సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
వచ్చే వారం క్యాబినెట్ సమావేశం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను ఛిన్నాభిన్నం చేస్తోందని కేసీఆర్ భావన. బడ్జెట్ నిర్వహణ రుణాలను పెంచడానికి అనుమతించకపోవడం, ఆర్థిక సంక్షోభానికి దారితీసే దృష్ట్యా, దీనిపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికే ఆర్థిక అధికారులతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ సమావేశపు ఎజెండాలో పునరుద్దరించిన పంపిణీ రంగ పథకాన్ని కూడా చేర్చనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, వరి కొనుగోళ్లు, ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మొత్తం మీద నీళ్లు, నిధులు, నియామకాలు, విద్యుత్, మౌలిక వనరులు తదితర అంశాలపై జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించడంలో బిజీగా కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ నినాదాలను తయారు చేసి విజయం సాధించారు. ఆ తరహాలోనే ఇప్పుడు కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఎజెండాను తయారు చేయడంతో పాటు నినాదాలను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దసరా నాటికి కొత్త పార్టీ విధివిధానాలను కూడా రూపొందించి `దేశ్ కీ నేత`గా మారాలని చూస్తున్నారు. బంగారు తెలంగాణ మోడల్ ను చూపడం ద్వారా మోడీ తరహాలో ప్రచారాన్ని రక్తికట్టించాలని కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు పత్యేక ఎజెండా వ్యూహం ఇంకో వైపు రాజకీయ వ్యూహాలను సమాంతరంగా తీసుకెళ్లడానికి ప్రగతిభవన్లో ప్రశాంత్ కిషోర్ తో బుధవారం భేటీ అయ్యారని తెలుస్తోంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో స్టాటజీని ప్లే చేయడం ద్వారా సక్సెస్ కావాలని యోచిస్తున్నారట. అందుకే బీహార్ బాధ్యతలను `పీకే` చూసుకుంటారని తెలుస్తోది. ఇక సహజ మిత్రులుగా ఉన్న ఎంఐఎం, కేసీఆర్ పెట్టే కొత్త పార్టీ కలిసి ఆయా రాష్ట్రాల్లోని చిన్నాచితక పార్టీలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా హవా చాటాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.
Related News
KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !
తెలంగాణ రాష్ట్ర సమితి, భారత సమితిగా మారినప్పటి నుంచి దూకుడుగా వెళ్తోంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది.