Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.
- Author : Pasha
Date : 25-04-2024 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ అంశాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల విజిటింగ్ వీసాపై ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో మరో నాలుగు నెలల తర్వాత ప్రభాకర్ రావు మన దేశానికి తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పరారయ్యారు. ఈవిషయాన్ని గుర్తించిన వెంటనే తెలంగాణ పోలీసు శాఖ ఆయనపై లుక్ అవుట్ నోటీసును జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేసే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు పెడతారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన పోలీసులపై ఆ సెక్షన్లను కూడా నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఆ కేటగిరీ సెక్షన్లలోనే ఒకటి ఐటీ యాక్ట్ 66(F). దీని కింద కేసును ఎదుర్కొంటున్న వారిపై ఒకవేళ అభియోగాలు నిరూపితమైతే జీవిత ఖైదు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. ఐటీ యాక్ట్ 70 సెక్షన్ను కూడా వారిపై నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్ కింద కేసు నిరూపితమైతే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై ఐటీ యాక్ట్ కింద కేసుల నమోదుకు అనుమతించాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారట.
Also Read :WhatsApp Offline File Sharing : ఇంటర్నెట్ లేకున్నా ఫైల్స్ షేరింగ్.. వాట్సాప్ కొత్త ఫీచర్
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావ్, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అరెస్టయిన వారి నుంచి పూర్తి వివరాలను సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. నిందితులను బెయిల్పై విడుదల చేస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచిచూడాలి.