Telangana Politics: రాజకీయ గురువు చంద్రబాబుపై మైనంపల్లి కామెంట్స్
ఢిల్లీ వేదికగా కాంగ్రెస్లో చేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు
- Author : Praveen Aluthuru
Date : 02-10-2023 - 10:58 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Politics: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్లో చేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కుమారుడు రోహిత్రావుకు టికెట్ కేటాయించకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని విభేదించిన మైనంపల్లి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల నుంచి పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
హనుమంత రావు ప్రత్యేకంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. అసమ్మతి గొంతులను అణచివేసే నియంతృత్వ పాలనలో రాష్ట్రం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలనను పునరుద్ధరించి, నియంతృత్వ పాలన అంతమయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన తన మద్దతుదారులకు రాష్ట్ర పోలీసులు అడ్డంకులు సృష్టించారని హనుమంతరావు విమర్శించారు.
హైదరాబాద్కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిరసనలను నిషేధించడం శోచనీయమన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణాలో టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ సమస్య ఏపీలోనే తేల్చుకోవాలని, తెలంగాణాలో నిరసనలు తెలిపేందుకు అనుమతి లేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండించింది. నిరసన తెలిపే హక్కు ఎక్కడైనా ఉందని విమర్శించింది. కాగా మైనంపల్లి టీడీపీకి సపోర్టుగా మాట్లాడటం, బీఆర్ఎస్ తీరుని ఎండగట్టడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మైనంపల్లి హన్మంతరావు 1998లో టీడీపీతో రాజకీయ ప్రవేశం చేశాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు
మరోవైపు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేసి త్వరలో భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉంది.కాగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కాంగ్రెస్ అధిష్టానం మైనంపల్లి కుటుంబానికి రెండు సెట్లు కేటాయించింది. కొడుకు రోహిత్, హనుమంతురావుకు రాబోయే ఎన్నికలలో పార్టీ టిక్కెట్లు ఖాయమయ్యాయి.
Also Read: NIA : కుట్ర కేసులో మావోయిస్టు సానుభూతిపరుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ