MP Raghunandan Rao : నిన్ను లేపేస్తాం అంటూ ఎంపీ రఘునందన్ కు మావోలు హెచ్చరిక
MP Raghunandan Rao : "మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం" అంటూ వచ్చిన కాల్లో ఆయనకు స్పష్టమైన ముప్పు జారీ చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ,
- Author : Sudheer
Date : 29-06-2025 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
మెదక్ లోక్సభ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(MP Raghunandan Rao)కు మరోసారి బెదిరింపు కాల్ ( Threat call) రావడం కలకలం రేపుతోంది. “మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం” అంటూ వచ్చిన కాల్లో ఆయనకు స్పష్టమైన ముప్పు జారీ చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ, తమ టీంలు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నాయని బెదిరింపుదారులు హెచ్చరించారని సమాచారం. రెండు భిన్న నంబర్ల నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్స్పై ఎంపీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Mahaa News : ‘మా గడ్డపై ఉంటూ మాపై అసత్య ప్రచారం చేస్తారా’? – జగదీశ్ రెడ్డి
గత జూన్ 23న కూడా రఘునందన్ రావుకు ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం మధ్యప్రదేశ్ మావోయిస్టుల పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి, “ఈ సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం, దమ్ముంటే ప్రాణాలు కాపాడుకో” అంటూ బెదిరించాడు. అదే రోజు మేడ్చల్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన పీఏ నెంబర్కు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాల్లో మావోయిస్టు అనే వ్యక్తి “ఆపరేషన్ కగార్” పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ హెచ్చరికలు ఎన్కౌంటర్లకు ప్రతిస్పందనగా తలపించాయి.
కేంద్ర హోం శాఖ మావోయిస్టులపై తీవ్రంగా దృష్టి సారించడంతో ఇటీవల వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేంద్ర సాయుధ బలగాలు అడవుల్లోకి ప్రవేశించి మావోయిస్టుల స్థావరాలను కదిలిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే బెదిరింపులు కేంద్రం చేపడుతున్న మిషన్ను అడ్డుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పట్ల ఇటువంటి బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.